సమైక్య రాష్ట్రంలో బోసిపోయిన చెరువులు, వాగులు.. కరెంట్ కష్టాలు.. ఎండిన పంటలు.. కరువు కాటకాలు..వలసలు.. రైతు ఆత్మహత్యలు.. సాగు,తాగునీటి కష్టాలు.. అధ్వాన రోడ్లు.. అంతంతమాత్రంగానే సంక్షేమం.. నిత్యం ఆందోళనలతో సతమతమైన మెతుకుసీమలో పదేండ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగంగా చెప్పవచ్చు. కేసీఆర్ సర్కారులో ఉమ్మడి మెదక్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గడిచిన పదేండ్లలో జిల్లాలో వందేండ్ల అభివృద్ధి జరిగింది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయి. గోదావరి జలాలు వచ్చాయి. చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు నిర్మాణమయ్యాయి. ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. రైలు తెచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందించారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశారు. నాణ్యమైన కరెంట్ సరఫరా చేసి ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల అవసరం లేకుండా చేశారు. అన్నిరంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసి, క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చూశారు. గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానం చేస్తూ పెద్దఎత్తున రహదారులు, బ్రిడ్జిలు నిర్మించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జీపీలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన చేరువ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. 11 సార్లు రైతుబంధు, రైతుబీమాను
అందించారు.
సిద్దిపేట, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ ప్రభుత్వం తన తొమ్మిందేడ్ల పాలనలో బలమైన పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతిదారులను నిర్మించింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ శ్వేత పత్రాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిదిన్నర ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది… అనే అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో స్వేద పత్రం విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం …తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విధ్వంసమైన చెరువులను మిషన్కాకతీయ ద్వారా పునరుద్ధరించింది. ఆ చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి సాగునీరు అందించింది. సిద్దిపేట జిల్లాలో రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి రిజర్వాయర్ను ట్రయల్న్ పూర్తిచేసింది. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టింది. మల్లన్నసాగర్తో సింగూరు ప్రాజెక్టు లింక్ కలిపింది. మెదక్ జిల్లాలో ఘనపూర్ ఆనకట్టను ఆధునీకరించింది. హల్దీ, కూడవెల్లి వాగులపై అనేక చెక్డ్యామ్లను బీఆర్ఎస్ సర్కారు నిర్మించింది.
ఫలితంగా నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగింది. భూమికి బరువయ్యేంత పంట పండేలా కేసీఆర్ ప్రభుత్వం చేసిందని ఈ ప్రాంత రైతులు చెబుతున్న మాట. రైతుల్లో ఎనలేని భరోసాను కేసీఆర్ కల్పించారు. తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ల దూరం నడిచిన ఆడబిడ్డల కష్టాలు కేసీఆర్ తీర్చారు. సిద్దిపేట మానేరు పథకం స్ఫూర్తితో రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నడింట్ల నల్లాలు పెట్టి, శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా కేసీఆర్ అందించారు.నీళ్ల సమస్య తీర్చారు. ప్రతి బస్తీకి, ప్రతి పల్లెకు, ప్రతి గూడేనికి, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించారు. జిల్లాలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశారు.నాణ్యమైన కరెంట్ సరఫరా చేసి ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల అవసరం ప్రజలకు లేకుండా కేసీఆర్ చేశారు. నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా వ్యవసాయానికి అందించారు. అన్నిరంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసి, క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా కేసీఆర్ చూశారు. ఫలితంగా అన్నివర్గాల వారు తమ పనులు చేసుకున్నారు. చేతినిండా పని.. కంటినిండా నిద్ర పోయారు. గ్రామాలు, మండలాలు, జిల్లాకేంద్రాలను అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున రహదారులు, బ్రిడ్జిలు నిర్మించారు.
ప్రజల వద్దకు పాలన చేరువు చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు.పరిపాలన కోసం చక్కటి భవనాలు నిర్మించారు. ప్రతి జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణం చేయడంతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరికాయి. ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు దొరికాయి. ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించి, పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంధ్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్రం వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ప్రగతిని సాధించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయినప్పటికీ, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పంట పెట్టుబడి కోసం రైతుబంధు సాయాన్ని సీజన్ కంటే ముందే కేసీఆర్ అందించిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం మొత్తంగా 11 సార్లు రైతుబంధు సాయాన్ని సకాలంలో రైతులకు అందజేసింది. రైతు ఏ రకంగా మరణించినా ఆ కుటుంబానికి సకాలంలో రైతుబీమాను అందించింది.సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించి ఆ ఇంటి పెద్ద కొడుకుగా కేసీఆర్ నిలిచారు. ఇవన్నీ యావత్తు ప్రజల కండ్ల ముందు జరిగాయి.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సన్న, చిన్న కారు రైతులే అధికంగా ఉన్నారు. రైతు భీమా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో16,061 మంది రైతు కుటుంబాలకు గాను రూ. 803. 05 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అందించింది.ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున నేరుగా రైతు నామిని ఖాతాలోనే జమ చేశారు. రైతులు తమ పంట పొలాలకు వెళ్ళినప్పుడు అనుకొని సంఘటనలు జరిగి మృతి చెందుతున్నారు. ఇలా రైతు ఏవిధంగా మరణించిన ఆ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం పరిహారం అందించింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 85,99,091 మంది రైతుల ఖాతాల్లో రూ. 8,771.73 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమచేసింది. మే 2018లో కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలను అందించారు. తర్వాత ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందించారు. ఇప్పటి వరకు 11 విడతలుగా నిరంతరాయంగా రైతుబంధును కేసీఆర్ అందించారు. ఒకప్పుడు తాగునీళ్లు, సాగునీళ్లు లేక కరువు కాటకాలకు నిలయంగా ఉమ్మడి మెదక్ జిల్లా..ఇవాళ గోదావరి నీళ్లతో సస్యశ్యామలమైంది. కేసీఆర్ చేపట్టిన సంస్కరణల మూలంగా పుట్ల కొద్ది ధాన్యం పండింది. కాలంతో నిమిత్తం లేకుండా ప్రతి గుంటనూ సాగు చేశారు. రైతు ముంగిటలోనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ తొమ్మిదేండ్ల కాలంలో విద్యుత్శాఖలో సమూల మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో ఒక విద్యుత్ మీదనే రూ. 4,104. 08 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా రూ.102.22 కోట్లు లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేసింది. ఇందులో దివ్యాంగులు 37,785 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికోసం ప్రతినెలా ఒక్కొక్కరికి రూ. 4,016 చొప్పున రూ.15,17, 44,560, మిగతా వర్గాల వారు 4,31,790 మంది లబ్ధ్దిదారులకు మొత్తం రూ. 87,04,88,640 చెల్లించింది.
సిద్దిపేట జిల్లాలో ప్రతినెలా 1,91,185 మంది లబ్ధిదారులకు రూ.41.39 కోట్లు, వీటిలో 14,237 మంది దివ్యాంగులకు ప్రతినెలా రూ. 5,71,75, 792, మిగతా వర్గాలు 1,76,948 మంది లబ్ధ్దిదారులకు రూ. 35,67,27,168 చెల్లించారు.
మెదక్ జిల్లాలో ప్రతినెలా 1,16,728 లబ్ధిదారులకు రూ. 25.24 కోట్లు, దివ్యాంగులు 8,558 మంది లబ్ధిదారులకు రూ. 3,43,68,928, మిగతా వర్గాలవారు 1,08,170 మంది లబ్ధ్దిదారులకు రూ. 21,80,70,720 బ్యాంకు ఖాతాలో కేసీఆర్ ప్రభుత్వం వేసింది.
సంగారెడ్డి జిల్లాలో ప్రతినెలా 1.61,662 మంది లబ్దిదారులకు రూ.35.58 కోట్లు, దివ్యాంగులు 14,990 మంది లబ్ధిదారులకు రూ. 6,01,99, 840, మిగతా వర్గాల వారు 1,46,672 మందికి రూ. 29,56,90,752 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో కేసీఆర్ ప్రభుత్వం వేసింది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సన్న, చిన్న కారు రైతులే అధికంగా ఉన్నారు. రైతుబీమా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 16,061 మంది రైతు కుటుంబాలకు రూ. 803.05 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అందించింది.ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున నేరుగా రైతు నామినీ ఖాతాలోనే జమ చేసింది. రైతులు అనుకొని సంఘటనల్లో మృతిచెందితే ఆ కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించింది.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అప్పు తెచ్చినా.. భారీ స్థాయిలో సంపదను సృష్టించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించింది. ప్రతి మండల కేంద్రానికి గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య లభిస్తున్నది. నిరుపేద విద్యావంతులే విదేశాల్లో చదువుకోవడానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది. రాష్ట్రం దివాళా తీయకుండా పదేండ్లు నెట్టుకొచ్చింది. చివర వరకు మిగులు బడ్జెట్ను చూపించింది. తెలంగాణను అప్పుల కుప్పగా చేశారనడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనం.
కరెంట్, తాగు,సాగునీటితో 60 ఏండ్లు గోసపడిన తెలంగాణను కేవలం ఆరున్నరేండ్లలోనే అబ్బురపడే అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతులు, ఇంటింటికీ సంక్షేమం పథకాలను అందించిన కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభు త్వం శ్వేతపత్రం విడుదల చేయడం విడ్డూరం. కారుచీకట్ల తెలంగాణకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. బీఆర్ఎస్ హయాంలో అప్పులు పెరిగాయి.. ఇప్పుడు మేం ఆరు గ్యారెంటీలను ఎట్ల అమలు చేయాలి..? అనడం సరికాదు. రాష్ట్రం అప్పులపాలైందనే సాకు జెప్పి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనబడుతున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ శ్వేదపత్రంలో చెప్పిన విధంగా అప్పటి, ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరిగోస పడ్డాం. ఆంధ్ర నుంచి విడిపోయినంక ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిన్రు అప్పటి సీఎం కేసీఆర్. కరెంట్ గోస అయితే చెప్పరానిది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కావాలంటేనే దొరికేది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్పై అబండాలు వేయడం సరికాదు. అందరికీ మేలు జరిగేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను తప్పులతడకగా చూపించారు. రూ.4 లక్షల కోట్లు లేని అప్పును రూ. 7 లక్షల కోట్లుగా తప్పుగా చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మాట తప్పే పార్టీ. అప్పులు, అభివృద్ధి గురించి కేటీఆర్ మంచిగా వివరించి చెప్పిండు. ప్రజలకు ఇప్పుడు అర్థమయ్యింది.. ఏది తప్పో, ఏది కరెక్టో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాటలు వేశారు. గిరిజన గురుకులాలు ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియం బోధన అందించారు. పేద గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేసి హక్కులు కల్పించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ సర్కార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు మాత్రమే శ్వేతపత్రంలో చూపించింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు కూడా అందులో చూపిస్తే బాగుండేది. ప్రజాప్రయోజనాల కోసం అప్పులు చేయడం పెద్ద నేరమేమి కాదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. రైతుల కోసం ఎంతో కృషి చేసింది. వీటన్నింటినీ లెక్క కట్టలేం. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఇలాంటి శ్వేతపత్రాలతో దేశంలో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటుంది. కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులను స్వేదపత్రం ద్వారా కేటీఆర్ ప్రజలకు చక్కగా వివరించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఐటీ హబ్గా తయారైంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే అది కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణం. యువతకు హైదరాబాద్ ఉపాధి కేంద్రంగా మారింది. 10 ఏండ్లలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కింది. అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు తమ రెండో క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో ఐటీ మినిస్టర్గా కేటీఆర్ చేసిన కృషి మరువలేనిది. దేశంలో నేడు ఐటీకి కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ నిలిచిందంటే అప్పటి సీఎం కేసీఆర్ పాలనే కారణం.
కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం మ్యానిఫెస్టోలా ఉంది. ప్రజలు తమకు అధికారం ఎందుకిచ్చారో కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయాలి. ఇంతకు ముందున్న ప్రభుత్వం కంటే మంచిగా పాలన చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెప్పిన హామీలు నెరవేర్చలేకనే శ్వేతపత్రం పేరుతో డ్రామాలు చేస్తుందనే అభిప్రాయం ప్రజలకు కలుగక మానదు. కాంగ్రెస్ మంత్రులు చెబుతున్న సమాధానాలు సైతం ఒకరికి.. ఒకరికి పొంతన లేవు. కాంగ్రెస్ అధికారం రావడంతో పాలన ఎలా చేయాలో అర్థం కాకనే రాష్ట్రం అప్పులపాలు అయ్యిందనే అంశాన్ని లేవనెత్తారు. సమైక్య రాష్ట్రంలో వెనకబడిన తెలంగాణ.. పదేండ్లలోనే అభివృద్ధి రాష్ర్టాల జాబితాలో చేరిన విషయం కాంగ్రెస్ నాయకులకు కనబడుతలేదు. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందింది. అప్పులతో పాటు ఆస్తులు సైతం పెరిగాయన్న ముచ్చట తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది.
న్యాల్కల్, డిసెంబర్ 24: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా శ్వేతపత్రంతో బీఆర్ఎస్ పాలనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని సర్పంచుల ఫోరం న్యాల్కల్ మండల అధ్యక్షుడు రవికుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు మారుతీయాదవ్ విమర్శించారు. ఆదివారం కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను వారు ప్రజాప్రతిరినిధులు, నాయకులు, గ్రామస్తులతో కలిసి టీవీలో తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జరిగిందన్నారు.