ములుగు, మే 6: అలవికాని హామీలతో గద్దెనెక్కి, వాగ్ధానాలు విస్మరించిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ములుగులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోకు ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందిందన్నారు. ప్రతి గడపకూ కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందించారని గుర్తుచేశారు. ప్రాణాలకు తెగిం చి రాదనుకున్న తెలంగాణను సాధించి పెట్టిన కేసీఆర్ను నోటికి వచ్చినట్టుగా తిడుతున్న రేవంత్కు ఓట్లతోనే గుణపాఠం చెప్పాలన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలోంచి హామీల అమలుకు పోరాడుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి హామీలు అమలు చేయకపోవడమేకాక ఉన్న పథకాలను ఊడగొట్టి ప్రజలకు నష్టం కలిగిస్తున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదించి గెలిపిస్తే కష్టసుఖాల్లో అందరికీ అండగా ఉంటాడన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో లేని విద్యుత్, నీటి సమస్య నాలుగు నెలల్లో కాంగ్రె స్ పాలనలో ఎట్లా వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే పెనం మీదకెళ్లి పొయిల పడ్డట్లయితదన్నారు.
ప్రతి మహిళా ఖాతాలో రూ.2500 నెలనెలా జమ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు మహిళలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కరోనా సమయంలో సైతం రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. కేసీఆర్ను పట్టుకొని పేగులు మెడలో వేసుకుంటా, అంగీ, లాగు ఊడపీకుతానని రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ను పట్టుకొని అలా మాట్లాడొచ్చా అని హరీశ్రావు ప్రశ్నించారు. రూ. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్న కాంగెసోళ్లు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని హరీశ్రావు మండిపడ్డారు. ఇంతలా మోసం చేస్తున్న కాంగ్రెస్కు మళ్లీ ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, బీఆర్ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబేర్పాషా, ఎంపీపీ లావణ్యాఅంజన్ గౌడ్, జడ్పీటీసీ జయమ్మఅర్జున్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు గణేశ్గుప్తా, నాయకులు బాల్రెడ్డి, భూపాల్రెడ్డి, హరిబాబు, ప్రవీణ్, ములుగు, వర్గల్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆశీర్వదించండి.. అండగా ఉంటానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ట్రస్టు ద్వారా ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లు పెట్టి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తానన్నారు. ఎంపీగా గెలిచిన ఆరు నెలల్లోగా కేసీఆర్, హరీశ్రావు సమక్షంలో ట్రస్టు ఏర్పాటు చేసి ఉచిత సేవలను అందుబాటులోకి తెస్తానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్మేళా నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. ఒక్క రూపాయికే కల్యాణమండపాలను అద్దెకిచ్చేలా నిర్మిస్తామని చెప్పారు. కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.