సిద్దిపేట జిల్లాలో సాగుకు మంచి వాతావరణం
పట్టు, పచ్చిరొట్ట, విత్తన, వెద సాగుతో ఉజ్వల భవిష్యత్
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట, మే 14 : ‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట నుంచి జిల్లా వ్యవసాయ, ఉద్యాన వన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, అన్ని మండలాల, గ్రామ రైతుబంధు సమితి నాయకులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్పామ్ సాగు విరివిగా చూసేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. పచ్చిరొట్ట విత్తనాలు సాగు, పట్టు పంట, వెద సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా చైతన్యపర్చాలన్నారు. ఏవోలు, ఏఈవోలు క్లస్టర్ల వారీగా ఆయిల్పామ్ సాగు, పచ్చిరొట్ట విత్తనాలు, పట్టు పంట, వెగ సాగు లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 30వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటల నాటడం లక్ష్యమని, కానీ, కేవలం 8వేల ఎకరాల్లో మాత్రమే సాగుకు రిజిస్టర్ చేయించినట్లు, లక్ష్యాలకు అనుగుణంగా ఏఈవోలు పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవని మంత్రి సుతిమెత్తగా మందలించారు.
క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, చైతన్య పర్చాల్సిన అవసరమున్నదన్నారు. ఏఈవోలు, ఏవోలు, రైతుబంధు సమితి నాయకులు సమన్వయంతో అనుకున్న లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. కేంద్రం యాసంగి ధాన్యం కొననని చెప్పిన దరిమిలా రైతులు దీర్ఘకాలిక పంటలు, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు రైతుబంధు సమితి నాయకులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సెరికల్చర్ సాగుకు భార్యాభర్తలు కలిసి పని చేసుకునే కుటుంబాలను గుర్తించి, వారికి షెడ్, పట్టు పురుగులను రాయితీపై అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని చెప్పి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ పంటల సాగుతో రైతుకు సుస్థిర లాభాలు వస్తాయని, తద్వారా రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఈ మేరకు మండలాల వారీగా ఆయిల్పామ్సాగు, పచ్చిరొట్ట విత్తనాల సాగు, పట్టు పంట, వెద సాగుకు చేపట్టాల్సిన లక్ష్యాలను ఏవోలు, ఏఈవోలు, రైతుబంధు సమితి నాయకులు మంత్రికి వివరించారు. అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన్, శ్రీనివాస్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శివకుమార్, ఉద్యానవన శాఖ డీడీ రామలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు ఏఈవోలు పాల్గొన్నారు.