గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 23: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించడంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాదికి సంబంధించి రూ.10.49కోట్ల పన్నులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.8.91కోట్ల పన్ను లు వసూలు చేశారు. పెండింగ్లో ఉన్న మరో రూ.1.58లక్షలు వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. మార్చి చివరి వరకు 499 గ్రామ పంచాయతీల్లో నూరుశాతం పన్ను వసూలు చేయడమే టార్గెట్గా పంచాయతీ అధికారులు పని చేస్తున్నారు.
జిల్లాలోని నారాయణరావుపేట, తొగుట, బెజ్జంకి, జగదేవ్పూర్, వర్గల్ మండలాల్లోని గ్రామాల్లో 90శాతంకు పైగా పన్నులు వసూలు అయ్యాయి. జిల్లాలో 23 మండలాలుండగా 499 గ్రామ పంచాయతీలున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను వసూల్లో జిల్లాలోని 119 గ్రామ పంచాయతీల్లో నూరుశాతం పన్ను వసూలుతో జిల్లా వ్యాప్తంగా 84.90శాతం పన్ను వసూలు పూర్తి అయింది. నారాయణరావుపేట మండలంలో 99శాతం, తొగుట మండలంలో 94శాతం, బెజ్జంకి, జగదేవ్పూర్ మండలాల్లో 92శాతం, వర్గల్ 90శాతం కాగా చివరి స్థానంలో చేర్యాల 70శాతం వసూలు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల చివరి వరకు గ్రామాల్లో నూరుశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంతో పంచాయతీ అధికారులు కార్యచరణ రూపొందించుకున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10.49కోట్లు వసూలు టార్గెట్ కాగా ఇప్పటి వరకు జిల్లాలో రూ.8.91కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.1.58కోట్ల బకాయి పన్నులను మార్చి చివరిలోపు వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు పన్నుపై అవగాహన కల్పిస్తు వసూలు చేస్తున్నారు.
జిల్లాలో 119 పంచాయతీల్లో నూరుశాతం వసూలు..
జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో గత రెండు నెలలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఇంటి పన్ను వసూలులో జిల్లాలో 119 గ్రామ పంచాయతీలో నూరుశాతం వసూలు కాగా మిగతా 380 గ్రామ పంచాయతీల్లో 80శాతానికి పైగా పన్నులను వసూలు పూర్తి చేశారు. మార్చి నెల టార్గెట్గా అధికారులు పక్క ప్రణాళికతో గ్రామాల్లో ఇంటి పన్ను వసూలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రతినెల నిధులు విడుదల చేస్తుండడంతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. గతంలో లాగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను వసూలు ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తుండడంతో ప్రతి యేడు ఇంటిపన్ను లక్ష్యానికి అనుగుణంగా చేరుకుంటున్నారు.
రూ.8.91 కోట్ల ఇంటి పన్ను వసూలు..
జిల్లాలో పన్నులు మొత్తం రూ.8.91కోట్లు వసూలయింది. అయితే సంవత్సరంలో రూ.10.49కోట్లను వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 84.90శాతం వసూలు చేశారు. అయితే ఈ ఏడాది వసూలైన పన్నులో 119 గ్రామ పంచాయతీలో వందశాతం వసూలు చేశారు. ఇందులో నారాయణరావుపేట రూ. 17.53లక్షలు, తొగుట రూ.16.63 లక్షలు, బెజ్జంకి రూ.35.84లక్షలు, జగదేవ్పూర్ రూ.45.68 లక్షలు, వర్గల్ రూ.91.11లక్షలు, దుబ్బా క రూ.29.54లక్షలు, గజ్వేల్ రూ.59.02లక్షలు, సిద్దిపేట అర్బన్ రూ.1.09కోట్లు, నంగునూర్ రూ.39.43లక్షలు, చిన్నకొడూర్ రూ.50.74లక్షలు, మద్దూర్ రూ.24.20లక్ష లు, మిరుదొడ్డి రూ.25.09లక్షలు, దౌల్తాబాద్ రూ.19.47లక్షలు, రాయపోల్ రూ.12.35 లక్షలు, హుస్నాబాద్ రూ.20. 69లక్షలు, ములుగు రూ.2.05కో ట్లు, కొహెడ రూ.31.69 లక్షలు, మర్కుక్ రూ.37.96లక్షలు, సిద్దిపేట రూరల్ రూ. 31.60లక్షలు, కొమురవెల్లి రూ.24.20లక్షలు, అక్కన్నపేట రూ.28.43లక్షలు, కొండపాక రూ.59.95లక్షలు, చేర్యాల రూ.32.95లక్షలు వసూలు అయ్యాయి.
రాష్ట్రంలోనే సిద్దిపేట టాప్
తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటి పన్నులు వసూలు చేయడంలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయడమే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇప్పటి వరకు 119 గ్రామ పంచాయతీల్లో వందశాతం వసూలు అయ్యా యి. మార్చి చివరి నాటికి మిగతా వాటిలో కూడా వందశాతం వసూలు చేస్తాం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తాము పనిచేస్తున్నాం గ్రామాల్లోని ప్రజలకు పన్నులపై అవగాహన కల్పించి వసూలు చేయడం జరుగుతుంది.
– దేవకి దేవి, జిల్లా పంచాయతీ అధికారిణి