సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 22 : జనవరి మొదటి వారంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’ పనులపై పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ, డీఈ, ఏఈ, నిర్మాణ ఏజెన్సీ, సర్పంచులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంత్రి హరీశ్రావు సూచనల మేరకు జిల్లాలో చేపట్టిన పాఠశాలలను వచ్చే జనవరి మొదటి వారంలో తప్పకుండా ప్రారంభం చేయాలని ఆదేశించారు.
అదే లక్ష్యంతో వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. నంగునూరు మండలంలో పనులు త్వరగా పూర్తి చేసేందుకు డీఆర్డీఏ పీడీ, పంచాయతీ రాజ్ ఈఈలు పర్యవేక్షించి, వేగంగా పూర్తి చేసేందుకు సూచనలు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను తొలిగించడానికి గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేయాలని ఎంపీడీవోలు, సర్పంచులకు తెలిపారు. పాఠశాల భవనానికి అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదని, పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానం సుందరీకరణ చేయాలన్నారు. మంచి గేట్, పైన ఆర్చ్, గడ్డి కార్పేట్ వంటివి చేసుకోవాలన్నారు. హెచ్ఎంలు తప్పనిసరిగా పాఠశాల పూర్వం ఫొటో, తర్వాతి ఫొటోల ఆల్బమ్ పెట్టుకోవాలన్నారు. పనులు పూర్తయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉం టామన్నారు. మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్రావు, డీఈవో శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.