కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ‘మార్పు కావాలి’ అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత కర్షకులకు కష్టకాలాన్ని చవిచూపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అసలే సాగుకు నీరు లేకపోవడంతో పాట్లు పడుతున్న అన్నదాతలకు కరెంటు కోతలు తలనొప్పిగా మారాయి. పంట పొలాల్లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి పశువులకు గ్రాసంగా మిగులుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీళ్లిచ్చి పంటలను కాపాడాలని రైతన్నలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు.
చేగుంట, మార్చి 11: కరెంటు కోతలు, భూగర్భ జలాలు అడుగంటడంతో చేతికి వచ్చిన పంటలు ఎండిపోయి మేకలు, పశువులకు మేతగా మారాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండా, జామ్లా తండాలో 1800 ఎకరాలతో పాటు చేగుంట మండలంలోని కర్నాల్పల్లి తదితర గ్రామాల్లో రైతులు వేసిన పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా మారాయి. ఎండిన పంట పొలాలను ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలరాం బాబు సోమవారం పరిశీలించారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వేచేయించి పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి పరిహారం అందించాలని ప్రజాప్రతినిధులు కోరారు. నార్సింగి మండల కేంద్రానికి చెందిన రైతు తిప్పరాజ్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన బోళ్లు సత్తయ్య కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. పొలంలోని ఆరు బోర్లలో నీరు ఎత్తిపోగా, సోమవారం కొత్తగా బోరు వేయగా చుక్కనీరు రాలేదు.దీంతో రైతు బోరుమన్నాడు.
అప్పులు చేసి ఆరు వందల ఫీట్లతో దాకా రెండు బోర్లు వేయించా. అందులో చుక్క నీరు రాకపోవడంతో గుంతలను పూడ్చివేశాం.ఎవుసం చేయడం సాలిచ్చుకున్న. ప్రభుత్వం ఆదుకోవాలి. ఎండిపోయిన పంటల వివరాలను సేకరించి పంటలకు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
10 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న. పెట్టుబడికి ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా డబ్బులు ఖర్చు అయినవి.ఆరు బోర్లు ఉన్నా గుంట పొలం పారడంలేదు. పొలం ఎండిపోతుంటే ఏమి చేయాలే అర్థం కాక పంటను కాపాడుకునేందుకు మళ్లీ బోరు వేస్తే దుమ్ము మాత్రమే వచ్చింది.