సీ॥ సింజాన సుమనః ప్రయుంజాన మకరంద
భుంజాన మధుకరీ రంజితంబు
కంజాత కింజల్క పుంజాత తపరాగ
సంజాత నద పరిష్వంజితంబు
ఖంజరీట విహార మంజరీ పరివార
పింజరీ కృతభూజ మంజులంబు
గుంజాధి గమ్య సౌమంజస్య సమ్యఙ్ని
గుంజాతి రమ్య భూ మంజిమంబు
తే.గీ॥ నగుచు దొగరగు జిగిదగి నిగుడు మొగడ
లగణితములగు పొగడల తెగల సొగసు
గలవలపు గుమగుమ యని చెలువ జూప
బ్రమద వనమొప్పుచుండును నప్పట్టణమున
ఈ పద్యం ప్రౌఢకవి రాపాక లక్ష్మీపతి రచించిన ‘భద్రాయురభ్యుదయము’ అనే కావ్యం లోనిది. యమకాలంకారాలతో సొగసైన పద ప్రయోగాలతో విరాజిల్లే పద్యాలు ఈ కావ్యం నిండా కనిపిస్తాయి. కవీశ్వరుడైన కామినేని మల్లారెడ్డికి దాదాపు సమకాలీనుడైన ఈ కవి క్రీ.శ 1670-1750 ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. దోమకొండ సంస్థానానికి చెందిన ఈ కవి కావ్యాలతో పాటు మల్లారెడ్డి మొదలగు ఇతర కవుల కావ్యాలను సంస్థానాధిపతి రాజా రాజేశ్వరరావు బహదూర్ వర్మ ప్రచురించారు.
రాజన్న భూపాలుని (కృతిభర్త) శ్రీరామారెడ్డిపేట పురంలోని ప్రమద వనం అనే వనము వర్ణన ఇది. మకరందాలు గ్రోలుతున్న తుమ్మెదల ఝంకారాలు (సింజాన) తామరపూల కేసరాల నుంచి పుట్టిన పసిడి వర్ణపు రావముతో కలిసి (పరిష్వంజిత), కాటుక పిట్టలు (ఖంజరీట) విహరించి పసుపు పచ్చగా (పింజరీ)మార్చబడింది లేత చిగుళ్ళు గల కొమ్మలతో (మంజరీ)కూడిన మంజులమైన వృక్షాలు, అవ్యక్తమధురధ్వని (గుంజాన) గమ్యంగా బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్న భూమితో వగరు(తొగర)రుచితో క్రాలు (జిగి) మొగ్గల (మొగుడ) ప్రకాశంతో (నిగుడు) విస్తారమైన పొగడ పూల సొగసులు గుమగుమకల ఆ రవములతో చెలిమి చేయగా ఆ ప్రమద వనం ఆ పట్టణంలో విరాజిల్లుతున్నది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ