అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు మెదక్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పది ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే ఎన్నికల జిల్లా అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తనిఖీల్లో పట్టుకున్న మద్యం, డబ్బులను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు రూ.27.42 లక్షలు
పట్టుకున్నారు.
– మెదక్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)
మెదక్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నిర్వహణలో భద్రత అత్యంత కీలకం. అందుకే పోలీసులు తాము వ్యవహరించే పాత్రపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలను ముమ్మరం చేశారు.
జిల్లా సరిహద్దుల్లో ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేయగా, అందులో హవేళీఘనపూర్ పోచమ్మరాల్, రామాయంపేట దామరచెర్వు, నిజాంపేట, తూప్రాన్ టోల్గేట్, నర్సాపూర్ మల్లన్నదేవాలయం, బొడ్మట్పల్లి, పెద్దశంకరంపేట ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.27.42 లక్షలను పట్టుకున్నారు. వెల్దుర్తిలో రూ.12 లక్షలు, పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద రూ.6.33 లక్షలు, నర్సాపూర్లో 2.34 లక్షలు, మెదక్ మండలం మం భోజిపల్లిలో రూ.2.19 లక్షలు, రామాయంపేట మండలం అక్కన్నపేటలో రూ.1.90 లక్షలు, తూప్రాన్లో రూ.1.66 లక్షలు, మనోహరాబాద్లో రూ.లక్ష పట్టుకున్నారు. మెదక్ పట్టణంలో ఓ బ్యాంక్ నుంచి రైతులు రూ.2.19 లక్షలు తీసుకెళ్లుతుండగా పట్టుకున్నారు. తనిఖీల్లో రూ.50వేలు అంతకన్నా ఎక్కువ నగదు, సామాన్ల రూపం లో రూ.10 వేలు ఆపైన విలువైన సామాన్లు సీజ్ చేస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఇన్కాం ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, రవాణా చేస్తుంటే సందేహాత్మకంగా ఉంటే వెంటనే సీజ్ చేస్తున్నారు.
డబ్బు, మద్యం రవాణాకు కళ్లెం వేసేందుకు చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పది ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఆరు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు జిల్లాలో ఉండగా, గజ్వేల్, దుబ్బాక, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో నాలు గు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే కలెక్టర్ రాజర్షి షా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రతీ రోజు జిల్లా వ్యాప్తంగా పర్యటించడం, ఎన్నికల ఏర్పాట్లతో పాటు, చెక్ పోస్టుల్లో తనిఖీల తీరును ఆయన పరిశీలిస్తున్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన ప్రతి విషయం తెలిసేలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తనిఖీల్లో పట్టుకున్న మద్యం, డబ్బు లెక్కలు సక్రమంగా ఉండేలా చూడాలని, ప్రతీ తనిఖీలోని ఫొటోలు, వీడియోలు తీయాలని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఫీడ్ బ్యాక్ అధికారుల నుంచి తీసుకుంటున్నారు.