దుబ్బాకలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ
సీఎం కేసీఆర్ చిత్రపటాలతో గృహప్రవేశం
పండుగ వాతావరణంలో కార్యక్రమం
132మంది లబ్ధిదారుల ఆనందం
దుబ్బాక, జూలై 8 : నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. సొంతిల్లు రావడంతో లబ్ధిదారుల్లో డబుల్ సం తోషం నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం వరంగా మారింది. శుక్రవారం దుబ్బాక పట్టణంలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. దుబ్బాక మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక-బల్వంతాపూర్ రోడ్డులో ఒకే చోట వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణాలు చేపట్టారు. పది రోజుల క్రితం తొలి విడతలో 180 మంది లబ్ధిదారులకు ఇండ్లు అందజేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో 132 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేశారు. ఆగస్టు మొదటి వారంలో మూడో విడతలో మిగిలిన లబ్ధిదారులందరికీ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా ఇండ్లు పంపిణీ చేయనున్నారు.
132 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు
రెండో విడతలో 132 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయడంతోపాటు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటాలతో సంబురంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
టీఆర్ఎస్ హయాంలోనే పేదలకు సముచిత న్యాయం
-గన్నె వనితాభూంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, దుబ్బాక
టీఆర్ఎస్ హయాంలోనే పేదలకు సముచిత న్యాయం జరిగిందని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి అన్నారు.నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం వరంగా మారిందన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రత్యేక కృషితో వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పర్యవేక్షణలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవుని లలితాచంద్రయ్య, పల్లె మీనా, నిమ్మ రజిత, లోంక రాజవ్వ, ఆస సులోచన, బట్టు యాదమ్మ, పులిగారి కల్పన, ఆస యాదగిరి, దుబ్బాక బాలకృష్ణ, బత్తుల స్వామి, నాయకులు రొట్టే రాజమౌళి, వంశీగౌడ్, పాండు పాల్గొన్నారు.