సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 1 : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి ఇన్స్పైర్, 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన-2022ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరుగనున్నది. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి 325 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
సమాజానికి ఉపయోగపడేలా ఆలోచింపజేసే ప్రయోగాలు ఆలోచింపజేశాయి. సిద్దిపేట అర్బన్, తొగుట, దౌల్దాబాద్, రాయపోల్, జగదేవ్పూర్, వర్గల్ మండలాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలను జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక ప్రాంతం సైన్స్, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఆవిష్కరణల ద్వారానే శారీరక శ్రమను తగ్గించొచ్చని పేర్కొన్నారు. మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ దాగి ఉంటుందని, సమజానికి అవసరమయ్యే ఆవిష్కరణలు చేయడం ద్వారా పేదవారికి సేవ చేసినట్లవుతుందన్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ కలాంను వారి చదువు, వారిలో ఉండే నైపుణ్యాల ద్వారానే ప్రపంచం గుర్తించిందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, అదే తరహాలో ప్రతి సంవత్సరం మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఆశించిన స్థాయిలో విద్యార్థులు హాజరు కాలేకపోవడం గమనార్హం. జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. క్రమపద్ధతిలో ప్రదర్శన నిర్వహించకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా ఏర్పాట్లు చేశారని పలువురు విమర్శించారు. వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించేందుకు ఆటోలో విద్యార్థులను కుక్కి తీసుకొచ్చారు. వైజ్ఞానిక ప్రదర్శన తిలకించేందుకు సరైన క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కున్నారు.
ఆవిష్కర్తలు : కె.ధరణి, డి.సౌజన్య, జడ్పీజీహెచ్ఎస్, ప్రజ్ఞాపూర్
గ్లోబర్ వార్మింగ్ను తగ్గించడంతో పాటు సోలార్ ఎనర్జీని ఉపయోగించేందుకు జడ్పీ బాలికల పాఠశాల విద్యార్థినులు ధరణి, సౌజన్య సోలార్ ఎనర్జీ జనరేషన్ ఆన్ రోడ్స్ అనే ప్రయోగాన్ని ప్రదర్శించారు. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం రోడ్లపైనే సోలార్ ప్లేట్లను అమర్చి, అక్కడ ఉత్ప త్తి చేసిన విద్యుత్ను పవర్ స్టేషన్లకు పంపించి, తద్వారా వినియోగదారులకు అందించడంతో స్థలంతోపాటు రోడ్లపై నడిచే ఎలక్ట్రిక్ కార్లకు, లైట్లకు, ఇతర అవసరాలకు చార్జింగ్ కోసం వినియోగించవచ్చని వారు తెలిపారు. భవిష్యత్లో నీరు, బొగ్గు లాంటి వనరులు తగ్గిపోయినా సోలార్ ఎనర్జీ ద్వారా ప్రజలకు విద్యుత్ను అందించేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు.
ఆవిష్కర్త : కె.హిమబిందు,
జడ్పీహెచ్, చీకోడ్
ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా.. ఏదైనా కారణాలతో పైప్లైన్ లీకేజీ అయితే వెంటనే సంబంధిత కార్యాలయానికి వాయి స్ రూపంలో సమాచారం అందించేందుకు ఈ ప్రయోగాన్ని తయారు చేసినట్లు విద్యార్థిని కె.హిమబిందు తెలిపింది. యాంటీనా, సర్క్యూట్, స్పీకర్, పవర్ సైప్లె, ట్రాన్స్మీటర్, వాటర్ కండక్టివిటీ సెన్సార్ సహాయంతో ఈ ప్రయోగాన్ని తయారు చేసింది. స్వచ్ఛమైన నీరు కలుషితం కాకుండా ఉం డేందుకు గానూ, మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ అయితే వెంటనే వాయిస్ ద్వారా సమాచారం అందించడానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆవిష్కర్త : ఎన్ నివాస్,
జడ్పీహెచ్హెస్, మోతె
దవాఖానల్లో స్లైన్ ఎక్కించేటప్పుడు అందులోని ద్రవం చివరి దశకు చేరిన తర్వా త వైద్యులు గానీ, సిబ్బంది గానీ అందుబాటులో లేని సమయంలో స్లైన్ బాటిల్ అయిపోయి రోగి శరీరం నుంచి బ్లడ్ స్లైన్లోకి తిరిగి పంపింగ్ అవుతుంది. దాన్ని అధిగమించేందుకు స్లైన్ ఇండికేటర్ సహాయంతో బజర్ మోగుతూ సిబ్బందికి విషయాన్ని తెలియజేస్తుందని జడ్పీహెచ్ మోతె పాఠశాలకు చెందిన ఎన్.నివాస్ తెలిపాడు. స్లైన్ చివరి దశలో ఉన్న సమయం లో స్లైన్ బాటిల్తో సహా చార్జర్కు ఉన్న క్లిప్ పైకి వెళ్లి ఎగువ ఉన్న క్లిప్కు తాకగానే వల యం పూర్తయి ఎల్ఈడీ వెలుగుతూ బజర్ మోగుతుంది. ఇందుకు ఒక బ్యాటరీ, టర్మినల్ ఎల్ఈడీ బల్బ్, బజర్లను ఉపయోగించి స్లైన్ ఇండికేటర్ను తయారు చేసినట్లు తెలిపాడు. ముఖ్యంగా రాత్రి సమయంలో దవాఖానల్లోని సిబ్బందికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నాడు.