జహీరాబాద్, ఫిబ్రవరి 23: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, మంజీరా నీటిని జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. పట్టణానికి తాగునీరు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించగా, సింగూరు ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ సంపు నుంచి వస్తున్నాయని తెలిపారు. రాయికోడ్ మండలంలోని ఇటికేపల్లి మంజీరా బ్యాక్ వాటర్ వద్ద ఏర్పాటు చేసిన సంపు నుంచి కూడా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఇటికేపల్లి నుంచి నీటిని తరలించే పైపులైన్ కోసం ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాగానే కొత్త పైపులైన్ వేసి నీటిని అందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. మున్సిపల్ ఆదాయం పెంచేందుకు కృషి చేసి, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలన్నారు. పట్టణంలోని రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేసి మే వరకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలిన ఆర్అండ్బీ డీఈఈ నర్సిములును ఆదేశించారు. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత మార్కెట్ భవనం ప్రారంభించినా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పగించలేదని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకురాగా, తాళాలు అప్పగించాలని, బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని అక్కడే ఉన్న కాంట్రాక్టర్కు మంత్రి తెలుపడంతో కాంట్రాక్టర్ వెంటనే కలెక్టర్ వల్లూరు క్రాంతికి తాళాలు అప్పగించారు.
జహీరాబాద్ పట్టణంలో ఉన్న సర్కార్ దవాఖానలో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని, వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వైద్యం చేయాలన్నారు. డయాలసిస్ కేంద్రానికి వచ్చే రోగులకు మంచి వైద్యం చేయాలని, జహీరాబాద్లో ఉన్న కేంద్రానికి అదనపు పడకలు మంజూరు చేస్తామన్నారు. నిమ్జ్ ప్రాజెక్టు భూ సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జహీరాబాద్ ఆర్డీవో రాజు, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.