గుమ్మడిదల : ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దుచేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో అనంతారం కుర్మ సంఘం సభ్యులు 55వ రోజు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు జేఏసీ నాయకులు చిమ్ముల గోవర్ధన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు చిన్నపాపని కుమార్గౌడ్, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రిలే నిరాహారదీక్షల్లో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును రద్దు చేసేవరకు ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పారు. విద్యార్థుల పరీక్షలు ముగిసిన అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలు, నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వ పాలకుల్లో కదలికలు వచ్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
డంపింగ్యార్డు వల్ల ఇక్కడి గ్రామాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నా రాష్ట్ర పాలకవర్గం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రజాపాలన అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు ప్రజలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. ప్రజలకు న్యాయం జరిగేవరకు, డంపింగ్ యార్డు అనుమతులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి డంపింగ్యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పోచుగారి మోహన్రెడ్డి, రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, దోమడుగు బాల్రెడ్డి, మోహన్రెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, మన్నె రామకృష్ణ, కొత్తపల్లి మల్లేశ్గౌడ్, కొరివి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.