సిర్గాపూర్, జూన్ 20 : ఇంట్లో నిద్రిస్తున్న యువకుడికి పాము బలికొన్న సంఘటన సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గుండెబోయిన పాండు (27) రోజువారిగానే ఆదివారం రాత్రి భార్య పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది.
దాంతో ఆయన కేకలు వేయడంతో కుటుంబీకులు, స్థానికులు వచ్చి చూడగా ఇంట్లో కనిపించిన పామును చంపేశారు. పాండును హుటాహుటిని నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించినట్లు తెలిపారు.
మృతుడికి భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో మృతుడి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. నిరుపేద పాండు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.