పటాన్చెరు, జనవరి 8: తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమం తీవ్రరూపం దాల్చి మన తెలంగాణ మనకు వచ్చేందుకు వారు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆదివారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే – టీజేఎఫ్ రాష్ట్ర రెండో మహాసభను సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీతో కలిసి కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని కొనియాడారు. రాష్ట్రం వచ్చిన తరువాత చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణలో వస్తున్న విప్లవాత్మక మార్పులను చూపించేందుకు ఎందుకో మీడియా వెనుకబడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రధాని నరేంద్రమోడీ 9 ఏండ్ల పాలనలో ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టినా 350 మంది జర్నలిస్టులను ఆహ్వానించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారన్నారు. మీడియా ప్రజల పక్షంలో ప్రధానిని ప్రశ్నించాలని సూచించారు. రఫెల్ కుంభకోణంపై కొన్ని రోజులు కథనాలు వచ్చాయని, ఆ తరువాత నిలిచిపోయాయన్నారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కనుమరుగు అవుతున్నదన్నారు. సెన్సేషనల్ పేరున బురదజల్లి ప్రజాప్రతినిధుల పేరును అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. ఆ తరువాత తాము చెప్పింది తప్పు అని తెలిసినా దాన్ని ప్రస్తావించడంలేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు, పేపర్లు తమ పరిపాలనను బద్నాం చేసే ఉద్దేశంతోనే ఉన్నాయనిపిస్తున్నాయన్నారు.
జర్నలిస్టు నాయకుడు అల్లం నారాయణను మీడియా అకాడమీ చైర్మన్గా సీఎం నియమించారన్నారు. రూ.100కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. కోవిడ్ సమయంలో జర్నలిస్టులను ఆదుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోలా జర్నలిస్టుల సంక్షేమ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.3000 పింఛన్ కూడా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు ఇండ్ల స్థలాలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారన్నారు. అందరు జర్నలిస్టుల ప్రధాన డిమాండ్ ఇండ్ల స్థలాల కేటాయింపుపై సీఎం కేసీఆర్తో ప్రస్తావిస్తానని కవిత అన్నారు. నిజాయితీ, నిబ్బరంగా, వాస్తవాలు రాసే జర్నలిస్టులకు అందరు సలాం చేస్తారన్నారు. ఐజేయూ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నిశితంగా పరిశీలించాలని సూచించారు. యాదాద్రి దేవస్థానాన్ని దర్శించుకోవాలని కవిత ఆహ్వానించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ముందుండి పోరాడింది టీజేఎఫ్ : మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతలుగా తాము సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో పోరాడామని, ఆంధ్ర మీడియా సంస్థలు, సంఘాలు ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న వేళ తెలంగాణ జర్నలిస్టులు టీజేఎఫ్ గొడుగు కింద ఉద్యమాన్ని ముందుండి నడిపారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వార్తలు రాసే అవకాశం లేని చోట కూడా తెలంగాణ జర్నలిస్టులు తమ యజమాన్యాల బెదిరింపులను ఎదుర్కొని తెలంగాణ గళాన్ని సమాజానికి వినిపించారన్నారు. జర్నలిస్టులు చేసిన ఉద్యమ పోరాటాలు ఎక్కడ జరిగినా తాము వెళ్లి మద్దతుగా ఉండేవారమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మీడియా నీడన టీయూడబ్ల్యూజే ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వందకోట్ల సంక్షేమ నిధిని ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాల్లోనూ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. హెల్త్కార్డులు ఇస్తున్నామన్నారు. అక్రిడిటేషన్ కార్డులు రెట్టింపుగా ఇచ్చామన్నారు.
మీది ఆంధ్ర సంఘం : మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
తెలంగాణ అస్థిత్వం ప్రశ్నార్థకమైన వేళ సంబ్బండ వర్గాలు పోరుబాట పట్టిన సమయంలో మీ సంఘం ఆంధ్రపాలకుల అడుగుజాడల్లో నడిచింది వాస్తవం కాదా.? అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆరోపించారు. ఐజేయూకు మీకు సంబంధం లేదంటారా.? ఇక్కడ మీటింగ్కు వచ్చిన వారంతా ఐజేయూ ప్రతినిధులు కాదా.? ఇక్కడ వచ్చిన వేలాది మంది జర్నలిస్టులు కారా? 10వేల మందితో ఏర్పాటు చేసిన సంఘం మాది. మీరు మాకు ప్రెస్క్లబ్లో కూర్చుని పాఠాలు చెబుతారా? అని ఆ జర్నలిస్టు సంఘం నాయకులను నిలదీశారు. శక్తి అంటే తమ సంఘంది. ఇక్కడికి వచ్చి చూడండి సమావేశంలో మాతో ఉన్న జర్నలిస్టులను చూడాలని ఆహ్వానించారు. 22 రాష్ర్టాలకు చెందిన ఐజేయూ ప్రతినిధులు తమను గుర్తించారు. మీరు కాదనేది ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో ఒకశక్తిగా ముందుండి పోరాడిన సంఘం తమదన్నారు. సీఎం కేసీఆర్ అండదండలతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.
ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా సహకరించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఐజేయూ సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ, అకౌరీ, జీఎస్ సభా నాయకన్, వైస్ ప్రెసిడెంట్ సబీనా ఇంద్రజీత్, టీయూడబ్ల్యూజే జీఎస్ మారుతీసాగర్, టెమ్జు ప్రెసిడెంట్ సయ్యద్ ఇస్మాయిల్, జీఎస్ రమణ, జాతీయ వ్యవహారాల ఇన్చార్జి పీవీ కొండల్రావు, రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా నాయకులు యాదగిరిగౌడ్, ధారాసింగ్, యోగానంద్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, బీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.