జహీరాబాద్ , నవంబర్ 6 : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా నేలకల్ మండలం అడ్లూరు ఎస్ఐ దోమ సుజిత్ సూచించారు. గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ పూర్ గ్రామ శివారులోని స్వామి నారాయణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.
సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, విద్యార్థునులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్, సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు.
ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 లకు ఫోన్ చేసి పోలీసులకు, ఇతర శాఖల యంత్రాంగం సేవలు పొందాలని ఆయన కోరారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దు కొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, పోలీసులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరు పాల్గొన్నారు.