రామచంద్రాపురం, అక్టోబర్1 : రాయసముద్రం చెరువులో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయించాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ దృష్టికి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి తీసుకువెళ్లారు. శుక్రవారం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్సీపురం డివిజన్లో ఉన్న పలు సమస్యలను ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి మంత్రి కేటీఆర్కి వివరించారు.
ఆర్సీపురం డివిజన్లోని రాయసముద్రం చెరువులో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని తెలిపారు. చెరువు చుట్టూ కాలనీలు ఏర్పాటు కావడంతో పాటు బహుళంతస్తుల నిర్మాణాలు చాలా జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటుండడంతో జనాభ ఎక్కువగా పెరిగిపోయిందని వివరించారు.
చెరువులోకి మురుగునీరు చేరడంతో సమీప ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వీలైనంత త్వరగా సంబంధిత అధికారులను చెరువుని సందర్శించి ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఆర్సీపురంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు అద్వాన్నంగా మారాయని అన్నారు.
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయించి, రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆయన మంత్రి కేటీఆర్కు వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.