సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అణగారిన వర్గాలపై ఆదరాభిమానాలు చూపుతూ, గిరిజనుల అభ్యున్నతికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానం చేశారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు మాణిక్యం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ అమరుల త్యాగాల స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నిండాలన్న ఉద్ధేశంతో ఏ రాష్ట్రంలో చేయని విధంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు తెలంగాణలో 15రోజుల పాటు నిర్వహించారన్నారు. అంతేకాకుండా జాతీయ సమైక్యతను చాటేలా 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా జరుపుకొన్నామన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఒక గిరిజన బిడ్డగా తన మనసులోని మాటలను చెబుతున్నానని, మన సీఎం అభినవ అంబేద్కర్ అని, తాను అంబేద్కర్ను చూడలేదు కానీ, ఈ నాటి అంబేద్కర్ను చూస్తున్నానని కలెక్టర్ అన్నారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని ప్రత్యేకంగా తెలియజేశారు. ఇది పొరుగు రాష్ర్టాలకు ఆదర్శమని, భూమిలేని గిరిజనులకు గిరిజనబంధు ఇస్తామని సీఎం తీసుకున్న నిర్ణయం అణగారిన వర్గాల అభ్యున్నతిపై సీఎంకు ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కలెక్టర్ సీఎంకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి హరీశ్రావు అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ, ముందుకు నడిపిస్తూ అన్ని విధాలా చేయూతనిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులంతా సమైక్యంగా పని చేయాలని ఆదేశించారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం పోరాడి ఎందరో అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితమే నేడు స్వాతంత్య్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణను పోరాటాలతో సాధించుకున్నామని, అలాంటి రాష్ర్టాన్ని దేశంలో ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి దీక్షతో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ సాంస్కృతిక కళాకారులు దేశభక్తి, తెలంగాణ గేయాలతో ఉర్రూతలూగించగా, వివిధ పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, రచయితలు, కళాకారులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాజేశ్, ఆర్డీవో నగేశ్, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.