Panchyat Secretaries | జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1;00 గంట వరకు మాత్రమే విధులలో ఉంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కావున విధి నిర్వహణ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం గద్వాల మండలంలోని ఈడిగోని పల్లి గ్రామ పంచాయతీని, ధరూర్ మండలంలోని ఎల్మలోని పల్లి గ్రామ పంచాయతీలను మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పంచాయతీ కార్యదర్శులు కార్యాలయంలో అందుబాటులో లేనట్లు నిర్ధారించారు. గద్వాల, ధరూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శుల ముందస్తు అనుమతి తీసుకుని విధుల నుంచి వెళ్లారా..? అని వివరణ కోరగా, ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.
ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.