సంగారెడ్డి, జూన్ 6 : సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు నెలలు, సంవత్సరాలు సమయం తీసుకునే రెవెన్యూ అధికారులు చేర్యాల భూసేకరణ విషయంలో మాత్రం తక్షణమే రంగంలోకి దిగారు. చేర్యాల ఇండస్ట్రియల్ పార్కు కోసం 120.16 ఎకరాల భూసేకరణకు గురువారం ఉదయం కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారో లేదో సాయంత్రం కంది తహశీల్దార్ అసైన్డ్భూముల రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన భూములను వెంటనే అప్పగించాలని తహశీల్దార్ రైతులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం నిబంధనల మేరకు భూములకు నష్టపరిహారం ఇస్తామని, దీనికి వెంటనే అంగీకరించి భూములు స్వచ్ఛందంగా అప్పగించాలని లేదంటే బలవంతంగా లాక్కోవాల్సి వస్తుందని తహశీల్దార్ రైతులను హెచ్చరించినట్లు సమాచారం. సోమవారం 741 సర్వే నెంబర్లోని అసైన్డ్ భూముల వద్దకు వస్తామని అక్కడే భూములు కొలిచి భూములు స్వాధీనం చేసుకుంటామని, ఎవ్వరూ గొడవలు చేయవద్దని రైతులను తహశీల్దార్ భయభ్రాంతులు గురిచేసినట్లు తెలిసింది. అయితే తహశీల్దార్ వ్యవహారశైలిని తప్పుబట్టడంతోపాటు బెదిరింపులకు తాము తలొగ్గమని రైతులు స్పష్టం చేసినట్లు సమాచారం.
అసైన్డ్భూములు స్వాధీనం చేసుకోవాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఎకరాకు రూ.5 నుంచి రూ.7 కోట్లు చెల్లించాలని, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అప్పుడే భూములు ఇస్తామని రైతులు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. రైతులతో సమావేశంపై కంది తహశీల్దార్ రవికుమార్ వివరణ కోరగా చేర్యాల్లో ఇండస్ట్రియల్పార్కు ఏర్పాటుకు అవసరమైన 120.16 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించలేదని రైతులతో తన వద్దకు వచ్చినట్లు చెప్పారు. రైతులను భూములు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు. రైతులు మాత్రం తమకు ఎకరాకు రూ.5 కోట్లు పరిహారం ఇస్తేనే భూములు అప్పగిస్తామని వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. సోమవారం చేర్యాల గ్రామంలో రైతులతో భూసేకరణపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.