సంగారెడ్డి, జనవరి 8: కలమే తన బలమని, పద్మశాలీలు రాజకీయంగా సంఘటితం కావాలని, కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీలకు ఆరాధ్యనేతని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల మైదానంలో పద్మశాలీ క్యాలెండర్ ఆవిష్కరణ, మహిళల ముగ్గుల పోటీలు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుండు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పద్మశాలీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంఘం భవనానికి స్థలం కేటాయించేందుకు మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. భవన నిర్మాణానికి నిధుల కోసం కృషి చేస్తానని, జిల్లా కేంద్రంలో సంఘ భవనం ఏర్పాటు త్వరలో జరుగుతుందన్నారు.
హైదరాబాద్లోని కోకాపేట్లో రాష్ట్ర పద్మశాలీ భవనానికి పండుగ తర్వాత భూమిపూజ చేస్తామని, జిల్లా నుంచి భారీ సంఖ్యలో పద్మశాలీలు హాజరుకావాలన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులు, బాధలను ముఖ్యమంత్రి కేసీఆర్ కండ్లారా చూశారని, అందుకే చేనేత రంగానికి పూర్వవైభవం కల్పించేందుకు నిధులు మంజూరు చేసి ఆదుకున్నారన్నారు. జలదృశ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పద్మశాలీలు కొండా లక్ష్మణ్ అడుగుజాడల్లో నడిచి కుల బాంధవులకు ఆదర్శంగా నిలిచి రాజకీయంగా పద్మశాలీలు ఎదగాలని అకాంక్షించారు. డబుల్బెడ్ రూం ఇండ్లు రాని వారు అధైర్యపడకుండా ఇంటి నిర్మాణానికి సొంత స్థలం ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షలు నిధులు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా పద్మశాలీలు ఉన్నారని, 8 నియోజకవర్గాలను శాసించే స్థాయిలో జనాభా ఉందని, అందుకోసం పద్మశాలీలు రాజకీయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జీవీ వీణ, జాతీయ పద్మశాలీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు సోమ చంద్రశేఖర్, సాపాసుగంటి మల్లేశం, గందెమల్లే రాజు, జీవీ శ్రీనివాస్, జిల్లా తరలివచ్చిన పద్మశాలీ సంఘం నాయకులు, కుల బంధావులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.