కంది :పీడీ యాక్టు నేర నియంత్రణకు అసలైన అస్త్రం: ఎక్కడైనా ఒక నేరం జరిగితే ముందుగా ఆ విషయాన్ని పోలీసులు చేరవేస్తాం. ఆ తర్వాత పోలీసులు ఆ కేసు తమదైన శైలీలో ఛేదించి అందుకు గల కారణాలను గుర్తిస్తారు. అయితే కొంత మంది నేరాలకు అలవాడు పడి పదే పదే మళ్లీ జైలు నుంచి బయటికి వచ్చి తిరిగి నేరాలు చేస్తుంటారు. ముందస్తుగా ఇలాంటి వారిని పోలీసులు గుర్తించి అవసరమైతే తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తి పై రౌడీషీట్ను తెరుస్తారు. అది చేసాకా కూడా వారిపై ఎలాంటి మార్పురాకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై పీడీయాక్టు (ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్టు) అస్ర్తాన్ని ఉపయోగిస్తారు. ఇది గనక ఒక్కసారి ఉపయోగిస్తే సదరు నేరస్తునికి యేడాది పాటు ఎలాంటి బెయిల్ మంజూరు కాకుండా జైలులో శిక్ష అనుభవించాల్సిందే.
ఈ యాక్టు ద్వారా ఎంతో మంది కరుడుగట్టి నేరగాళ్లను పోలీసులు అదపులో ఉంచుతున్నారు. పీడీయాక్టు వేస్తే ఆ వ్యక్తి జీవితం సర్వ నాశనం కిందకే లెక్క. ఎక్కడైనా నేరాలు జరుగుతాయనే సమాచారంతో నేరాలను ముందుగా అదుపు చేసేందుకు నేరస్తులపై ఈ పీడీయాక్డును ఉపయోగిస్తుంటారు. ఈ యాక్టు వేసిన వ్యక్తి తిరిగి మళ్లీ నేరం చేయాలంటే వణిపోవాల్సిందే. ఎందుకు నేరం చేశామురా అంటూ మనోవేదనకు గురికావాల్సిందే. అసలు పీడీయాక్టు ఏంటీ.. ఇది ఎవరకి, ఎప్పుడు విధిస్తారు అనే అంశాలపై నమస్తేతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
నేరస్తులను కట్టిడి చేసేదే పీడీయాక్టు
దేశంలో ఎన్నో రాష్ర్టాల్లో ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్టు (పీడీ యాక్టు)ను నేరగాళ్ళపై విధిస్తుంటారు. అయితే ఒక్కో రాష్ట్రం లో ఈ యాక్టు అమలు ఒక్కో రీతిలో ఉంటుంది. అయితే తెలంగాణ సర్కార్ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఈ పీడీయాక్టులో మరో 13 కొత్త అంశాలను జోడించి నేరగాళ్లపై అమలు చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి ఓ సభలో మాట్లాడుతూ అమ్మాయిలను ఎవరైనా వేధించినా, లేక వారిని బాధించిన వాడికి సరైన శాస్తి కలిగేలా కఠిన చర్యలు పోలీసులు తీసుకుంటారని కూడా చెప్పారు.
అవసరమున్న చోట నేరాన్ని అదుపు చేయడంలో పీడీయాక్టును ఖచ్చితంగా అమలు చేసి నేరగాళ్లకు సరైన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో హైద్రాబాద్తో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల ఈ పీడీ యాక్టు నేరగాళ్లపై పోలీసులు విస్తృతంగా అమలు చేసి వారిని తిరిగి నేరం చేయకుండా కట్టడి చేయ డంలో కీలకంగా నిలుస్తున్నారు. వ్యవస్తీకృత నేరాలను కట్టిడి చేయడంతో పాటు మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్న వారిపై ఈ యాక్టు ఒక అస్త్రంగా వాడుతుంటారు.
పీడీ యాక్టుతో యేడాది పాటు జైలుకు…
ఎవరైనా నేరగాళ్లపై ఈ పీడీయాక్టు ప్రయోగిస్తే అతడిని బైయిల్ లేకుండా యేడాది పాటు శిక్ష విధిస్తారు. గతంలో ఏదైనా హత్యలో కాని, దొంగతంలో గానీ ఇతర నేరాలలో ఉన్న నేరస్తులపై ఇది ఒక అస్త్రంలా పోలీసులు వాడుతుంటారు. ఈ యాక్టు విధిస్తున్నారంటే నేరగాళ్లకు హడలెత్తిపోతారు. మళ్లీ నేరం చేయాలనే ఆలోచనే మానుకుంటారంటే ఈ యాక్టుకు ఎంత విశిష్టత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ యాక్టు ద్వారా చాలా నేరాలను పోలీసులు అదుపు చేయడంలో సక్సస్ అయ్యారు. ప్రధానంగా హైద్రాబాద్, కరీంనగర్, వంటి ప్రాంతాల్లో ఈ యాక్టు అమలును బాగా ఉపయోగించారు. మన ఉమ్మడి మెదక్ జిల్లాలో గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు 15 మందిపై పీడీ యాక్టును ఉపయోగించారు.
అయితే జిల్లాల పరిధిలో ఆ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆ జిల్లా కలెక్టర్ సహకారంతో ఈ పీడీ యాక్టును వినియోగిస్తారు. కమిషనరేట్ పరిధిలో నేరుగా కమిషనర్ ఈ పీడీ యాక్టు నేరస్తులపై వినియోగించే వీలు ఉంటుంది. అయితే ఈ పీడీ యాక్టు అనేది కేవలం నేరస్తులపై కాకుండా ఇంతకుమునుపు ఎలాంటి నేరం చేయకున్నా ఏదైనా నేరానికి పాల్పడుతున్నాడన్న సమాచరంతో కూడా కొత్త వ్యక్తిపై కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. నేరాలకు పాల్పడిన నిందితులు బెయిలపై బయటకు వచ్చి అమాయకులను భెదిరించడం, ఇతర నేరాల్లో పాల్గొనే వారిపై ఈ పీడీ యాక్టు ద్వారా సంవత్సర కాలం పాటు జైలు నిర్బంధించేందుకు పోలీసులు ఆస్కారం ఉంటుంది.
నేరాలను అదుపులో ఉంచేందుకే ఈ యాక్టు
జిల్లా పరిధిలో గతంలో నేర చరిత్ర కలిగిన వారు తిరిగి మళ్లి నేరాలకు పాల్పడుకుండా పీడీ యాక్టును ఉపయోగిస్తాము. ఒకసారి నేరం చేసిన వ్యక్తి తిరిగి నేరాలకు పాల్పడుకుండా ఈ యాక్టు ద్వారా వారిని జైలు నిర్భందించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో ఈ యాక్టు ఒక వ్యక్తిపై అమలు చేయాలంటే సదరు నేరస్తుడు, వ్యక్తికి సంబంధించి పూర్తి నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యాక్టు వారిపై ప్రయోగించడం జరుగుతుంది. నేరాలను కట్టడి చేయడంలో ఈ యాక్టు ఎంతో కీలకంగా నిలుస్తుంది. – ఎం.రమణకుమార్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ
ఇప్పటిదాకా 15 వరకు పీడీ యాక్టు కేసులు వచ్చాయి
గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 వరకు పీడీయాక్టు కేసులు సంగారెడ్డి జిల్లా జైలు వచ్చాయి. పీడీ యాక్టు ద్వారా వచ్చిన వారిని నేరుగా హైద్రాబాద్లోని సెంట్రల్ జైలు అయిన చెర్లపల్లి, చెంచల్గూడకు తరలించడం జరిగింది. ఈ యాక్టు అమలుతో ముందస్తుగా నేరాలను అదుపు చేసుకునే వీలు ఉంటుంది. యేడాది పాటు ఈ యాక్టును సదరు వ్యక్తులపై ఉపయోగించి జైలు నిర్భందిచడం జరుగుతుంది. – ఎన్. శివకుమార్గౌడ్, సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్