సంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రైతుల పక్షాన కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతున్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడంతో వారి పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేపట్టింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగివచ్చే వరకు పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో వరుస ఆందోళనలకు సిద్ధమై పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతం చేశారు. ఇందులో భాగంగా బుధవారం జాతీయరహదారుల దిగ్బంధం చేపట్టనున్నారు. మెతుకుసీమలోని సంగారెడ్డి జిల్లాలోని 65వ నెంబరు జాతీయరహదారి దిగ్బంధించనున్నారు. 3వేల మందితో సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో రైతులు పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలిరానున్నారు.
జాతీయ రహదారి దిగ్బంధం..
వడ్లు కొనుగోలు చేసేందుకు వివిధ రకాలుగా నిరసన తెలుపాలని టీఆర్ఎస్ పిలుపుతో పెద్ద ఎత్తున రైతులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డిలో జరిగే జాతీయ రహదారి దిగ్బంధంలో పాలుపంచుకోనున్నారు. టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొననున్నారు. టీఆర్ఎస్ కొంతకాలంగా రైతుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉన్నది. పలుమార్లు రాష్ట్ర మంత్రులు బృందంగా వెళ్లి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రిని కలిసి యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. పార్లమెంట్, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు వడ్లు కొనుగోలు చేయాలని నిరసనలు కూడా వ్యక్తం చేశారు.
అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి గోయల్ నూకలు తినండి అంటూ మాట్లాడటంతో రాష్ట్ర ప్రజానీకంలో ఆగ్రహం పెల్లుబికుతోంది. కేంద్రం మెడలు వంచేలా సీఎం కేసీఆర్ రైతుల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయరహదారుల దిగ్బంధం, జిల్లా కేంద్రంల్లో ధర్నాలు, పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం, రైతుల ఇండ్లపై నల్లజెండాల ఎగురవేత వంటి వరుస నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నేడు సంగారెడ్డిలోని 65వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. 3వేల మందితో జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో జాతీయ రహదారిని గంటపాటు దిగ్బంధించనున్నారు. ఇందుకు కోసం టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.
విజయవంతం చేస్తాం..
రైతులకు మద్దతుగా బుధవారం సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో 65వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం. 3వేల మందితో జాతీయ రహదారిని గంటపాటు స్తంభింపజేస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులను అవమానిస్తోంది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయమంటే కుంటి సాకులు చెబుతున్నది. కేంద్రం తీరును నిరసిస్తూ రైతుల పక్షాన జాతీయరహదారి దిగ్బంధించనున్నాం. జాతీయరహదారిపై రాస్తారోకోకు సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
– చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు