నారాయణఖేడ్, జూలై 1: తెలంగాణలో అధికారం చేపడ్తామని బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు పగటి కలగానే మిగిలిపోతాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలే కేంద్ర బిందువుగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారు.
అయితే తెలంగాణ రాష్టంపై వివక్ష చూపుతూ ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీకి ఇక్కడి ప్రజలు ఆదరించబోరన్నారు. విభజన చట్టంలో భాగంగా రాష్ర్టానికి రావాల్సిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేసి మాట్లాడిన ప్రధాని మోదీ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అనైతికంగా ఆంధ్రాలో కలిపి బీజేపీ తెలంగాణపై తనకున్న అక్కసును వెళ్లగక్కిందన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీటి ఎద్దడి కారణంగా అక్కడి ప్రజలు తమ నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాలకు వచ్చి మిషన్ భగీరథ నీరు తీసుకెళుతున్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలన్నారు.
ఉనికి కోసం బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, కుట్రలు మోసాలను ఇక్కడి ప్రజలు సహించబోరని, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, మున్సిపల్ వైస్చైర్మన్ పరశురామ్, ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.