సంగారెడ్డి, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో అత్యల్పంగా 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొద్దిరోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలితీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేకువజామున పొగమంచు కమ్ముకుంటుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడాల్సివస్తున్నది. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్లో 7.7 డిగ్రీలు, కోహీర్లో 7.8 డిగ్రీలు, జహీరాబాద్ మండలం మల్చెల్మలో 8.3 డిగ్రీలు, అందోలు మండలం అల్మాయిపేటలో 8.9, జహీరాబాద్లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత్తలు నమోదయ్యాయి.
జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జహీరాబాద్, కంగ్టి, హత్నూర, సిర్గాపూర్, మొగుడంపల్లి, నాగల్గిద్ద, కోహీర్, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర, జిన్నారం, పుల్కల్ మండలాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామచంద్రాపురం, అమీన్పూర్, కంది, మనూరు, చౌటకూరు, వట్పల్లి, కొండాపూర్, అందోల్ మండలాల్లో 12 డిగ్రీలు, రాయికోడ్, మునిపల్లి, నారాయణఖేడ్, సంగారెడ్డి మండలాల్లో 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలితీవ్రత పెరగటంతో ప్రజలు స్వెట్టర్లు ధరిస్తున్నారు. వేకువజాము, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఆ సమయాల్లో బయటకు రావటంలేదు.
మెదక్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో చలి తీవ్ర రూపం దాల్చుతున్నది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. దీంతో జనం ఇండ్ల నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారు. పైగా మూడు రోజుల నుంచి చలి ప్రతాపం కొనసాగుతుండడంతో దాని నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటున్నారు. జిల్లాలో ఆదివారం 7.2 డిగ్రీలకు చేరింది. మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఈ నెల 5వ తేదీన 16.6 డిగ్రీలు నమోదు కాగా, 6న 18.0 డిగ్రీలు కాగా, 7న 15.6 డిగ్రీలు నమోదైంది.
ఇబ్బంది పడుతున్న చిన్నారులు, వృద్ధులు…
మూడు రోజుల నుంచి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి గజగజ వణికిస్తున్నది. ఉదయం 9 గంటలు దాటినా చలి పోవడంలేదు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంకాలం సమయంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల్లో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయం, రాత్రి చలి తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్ని దుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.