హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ జె. సాయికుమార్ (PC 13128) ఏసీపీ కార్యాలయంలోని విశ్రాంతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సాయికుమార్ 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ నిమిత్తం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి గదిలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సాయికుమార్ను కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
సాయికుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.