హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు మరో ఎత్తుగడ వేసింది. ఆధార్ అథెంటికేషన్ ఉన్న వినియోగదారులకే రాయితీ వర్తిస్తుందని మెలిక పెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా జూలై నుంచే సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం లేదని తెలుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలమంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం వివిధ కారణాలను సాకుగా చూపి లబ్ధిదారుల సంఖ్యను సగానికిపైగా తగ్గించింది. ప్రస్తుతం 42.90 లక్షల మందికే సబ్సిడీ వర్తింపజేస్తున్నది. వారిలో కేవలం 20 లక్షల మందికి మించి సబ్సిడీ నగదు జమకావడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఎంపీడీవోలను అడిగితే గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాలంటూ చేతులు దులిపేసుకుంటున్నారని, గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తే తమకేమీ తెలియదంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని దరఖాస్తుదారుల్లో 18% మందికే రాయితీపై సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 82% మందికి మొండిచెయ్యి చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు జనవరి నుంచి ఈ ఏడాది జూలై వరకు కొత్తగా 11.27 లక్షల మందికి రేషన్కార్డులు మంజూరు చేసింది. వీరిలో 5 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించింది. కానీ, వీరికి ఎప్పటి నుంచి సబ్సిడీ వర్తింపజేస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే తూతూ మంత్రంగా సబ్సిడీ గ్యాస్ స్కీమ్ను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త రేషన్కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుందా అన్నది అనుమానాస్పదంగా మారింది.