సంగారెడ్డి, డిసెంబర్ 17 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు నిధులు కేటాయించింది. ఈ నెల 11న పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శరత్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జడ్పీలతో పాటు మండల ప్రజా పరిషత్లకు నిధులు కేటయించగా, సంగారెడ్డి జిల్లాకు రూ.19.26 కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో జిల్లా పరిషత్కు రూ.8.50 కోట్లు, మండల పరిషత్కు రూ.10.76 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పల్లె ప్రగతితో జనాభాను బట్టి ప్రతినెలా నిధులను కేటాయిస్తుండగా, ప్రభుత్వం వాటా కింద ఈ నిధులను కేటాయించడంతో పల్లెల్లో ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా ప్రజా పరిషత్కు జనరల్ ఫండ్ రూ. 6,56,57,036 కోట్లు, ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ.1,48,73,144 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్లో రూ. 44,83,540 లక్షలు ప్రభుత్వం కేటాయించి విడుదల చేసింది. అలాగే, 26 మండలాలకు జనరల్ ఫండ్ రూ.2,80,16,232 కోట్లు, ఎస్సీ సబ్ప్లాన్లో రూ.1,69,58,436 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్లో రూ. 6,25,26,368 కోట్లను కేటాయించి విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో జిల్లా, మండల పరిషత్ ద్వారా ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 50 శాతం నిధులు కేటాయించనున్నారు. మిగతా 50 శాతం నిధులతో గ్రామాల్లో ప్రాధాన్యతాక్రమం ఉన్న పనులు చేపట్టేలా త్వరలో మార్గదర్శ కాలను విడుదల చేయనున్నట్లు జడ్పీ అధికారులు సమాచారం.
జడ్పీ, మండల పరిషత్లకు పెరిగిన గౌరవం..
ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్లను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించి విడుదల చేస్తున్నది. దీంతో ఎస్సీ, ఎస్టీ వాడలు, జనరల్ ఫండ్ను సాధారణ ప్రాంతాలకు ఖర్చు చేసి అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రగతితో ప్రధాన వీధులన్నీ పరిశుభ్రంగా తయారు చేస్తున్నది. ప్రతినెలా గ్రామ పంచాయతీలతో పాటు పట్టణాలకు నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా పరిషత్కు రూ.8,50,13,720 కోట్లు కాగా, మండల పరిషత్లకు రూ.10,76,01,084 కోట్లను ప్రభుత్వం అభివృద్ధికి కేటాయించింది. 15వ ఆర్థిక ఫైనాన్స్ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధుల్లో 50 శాతం అధికంగా మండల పరిషత్లకు కేటాయించింది. జిల్లాలో ఉన్న 25 జడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు, 25 ఎంపీపీలు, 25 మండల కోఆప్షన్ సభ్యులు, 295 మండల ప్రాదేశిక సభ్యులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో కొంత మేరకు అభివృద్ధికి నిధులు రావడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
పల్లె ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్లకు ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ ద్వారా నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. జడ్పీ, మండల పరిషత్లకు ఎన్నికైన సభ్యులకు గ్రామాల్లో వారు చేపట్టే పనుల కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయి. జిల్లాకు ప్రభుత్వం రూ.19.26 కోట్లు విడుదల చేసి అభివృద్ధికి మార్గాలు చూపి ప్రగతిని వేగవంతం చేయడం సంతోషకరం. దీంతో ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులకు ప్రజల్లో గౌరవం పెరుగనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఉన్న పనులకు ఉపయోగించి అభివృద్ధి చేస్తాం.
-మంజుశ్రీజైపాల్రెడ్డి,జడ్పీ చైర్పర్సన్, సంగారెడ్డి