BT Road | ఝరాసంగం, జూన్ 25: చీలమామిడి తారు రోడ్డు నుండి ఏడాకులపల్లి వరకు అధ్వానంగా మారిన రహదారికి ఎట్టకేలకు తాత్కాలిక మోక్షం లభించింది. గత కొంతకాలంగా తీవ్రమైన గుంతలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఈ రహదారిలో గుంతలను పూడ్చే పనులను గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి గురువారం దగ్గరుండి ప్రారంభించారు.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్ తన సొంత చొరవతో ఎర్రమట్టిని తెప్పించి పెద్ద పెద్ద గుంతలను పూడ్పిస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారిందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తాత్కాలిక ఉపశమనం కోసం ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు.
రోడ్డు అధ్వానంగా మారడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు రావడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మార్గానికి శాశ్వత ప్రాతిపదికన నూతన బీటీ రోడ్డు మంజూరు చేయాలని స్థానిక గ్రామస్తులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, ప్రజల కష్టాలను గుర్తించి తాత్కాలికంగానైనా చొరవ తీసుకుని గుంతలను పూడ్పిస్తున్న సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.