సంగారెడ్డి : విద్యుదాఘాతంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..జూలై 25న జిల్లాలోని ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామంలో వ్యవసాయ పొలంలో పని చేస్తున్న మేరియమ్మ, దేవదాసు దంపతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, వారి అంత్యక్రియలలో పాల్గొన్న వసంత్ పిల్లలు, వారి తాతను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట మేరకు ఆయన గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20వేలు అందజేశారు. వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన వసంత్, భవిష్యత్తులోనూ పిల్లలకు అండగా ఉంటానని చెప్పారు. మానవీయంగా స్పందించి చిన్నారులకు అండగా నిలిచి సహాయం అందించిన వసంత్ను పలువురు అభివనందించారు.