న్యాల్కల్ : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వరంగల్ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమా రెడ్డి సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత పూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంతో పాటు వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక పరిశోధన కేంద్రంలో కొత్త పంటల పై చేపట్టిన పరిశోధనలతో పాటు పాలిటెక్నికల్ విద్యార్థులకు బోధిస్తున్న తీరుపై స్థానిక పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్థానిక పరిశోధన కేంద్రం పరిధిలో రైతులు సాగు చేసిన నువ్వుల పంటను పరిశీలించి చి పలు సూచనలు, సలహాలను అందజేశారు. యాసంగి సీజన్ లో వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేసుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
బరువైన నేలలో వేరుశనగ, కుసుమ తదితర పంటలను సాగు చేసుకోవాలన్నారు. తేలికపాటి నేలలో పప్పు ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసుకుంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు తప్పక పాటించాలన్నారు.
ఆయన వెంట శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కుమార్, విజయలక్ష్మి, తబస్సు ఫాతిమా, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.