సంగారెడ్డి, జనవరి 6(నమస్తే తెలంగాణ): కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడవద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘కంటి వెలుగు’పై వైద్య ఆరోగ్య శాఖ ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కంటివెలుగు శిబిరాల నిర్వహణ షెడ్యూల్ను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు చాలా గొప్ప కార్యక్రమన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి ఉచితంగా మందులు, అద్దాలు అందజేసేందుకు ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కంటివెలుగు శిబిరాలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వంద రోజులు కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తారన్నారు. ఈ శిబిరాల్లో జిల్లాలోని 17 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కంటివెలుగు పరీక్షల నిర్వహణకు జిల్లాలో 69 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశవర్కర్లు ఉంటారన్నారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీల్లోని ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో కంటి వెలుగు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉచితంగా మందులు, అద్దాల పంపిణీ
కంటివెలుగు శిబిరంలో ఉచితంగా పరీక్షలు, మందులు, కండ్లద్దాలు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రీడింగ్ అద్దాలు జిల్లాకు 27 వేల వరకు చేరుకున్నాయన్నారు. పాయింటెడ్ అద్దాలను పరీక్షల అనంతరం వారం రోజుల తర్వాత అందజేస్తారన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హైదరాబాద్లోని సరోజన కంటి వైద్యశాలకు పంపనున్నట్లు చెప్పారు.
కంటి వెలుగును విజయవంతం చేయాలి
కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12వ తేదీ వరకు మండల, గ్రామ స్థాయి లో కంటివెలుగు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు తమ గ్రామాల్లో నిర్వహించే కంటివెలుగు కేంద్రాల వద్ద భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు.
బృందాల నిర్వహణకు నిధులు మంజూరు
కంటివెలుగు బృందాలకు నిర్వహణ ఖర్చుల కోసం రోజూ రూ.1500 కేటాయించినట్లు తెలిపారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నందున కంటివెలుగు బృందాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని వైద్య అధికారులకు ఆదేశించారు. కంటివెలుగు పరీక్షా శిబిరాలకు వచ్చేవారు నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చేలా చైతన్యం కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఈనెల 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 17 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ఇందుకు 69 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, మున్సిపల్చైర్మన్లు బొంగుల విజయలక్ష్మి, పాండురంగారెడ్డి, డీఎంహెచ్వో డా.గాయత్రీదేవి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.