ఖమ్మం : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం (Khammam) జిల్లా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ( Puvvada Ajay Kumar ) అన్నారు. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలే స్ఫూర్తిగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఉపాధి రంగాల్లో అనేక కీలక కార్యక్రమాలను బీఆర్ఎస్ హయాంలో చేపట్టామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) నాయకత్వంలో తాను మంత్రిగా ఖమ్మం ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి పనులను చేపట్టామని వివరించారు. ఖమ్మం జిల్లాలో సాగునీటి విస్తరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని సీతారామ ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి వనరుల బలోపేతం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరం, జిల్లా పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.