జహీరాబాద్, ఫిబ్రవరి 8 : జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections) బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్.. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో వేగం పెంచింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో మళ్లీ బీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ముందుకుసాగుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందువరుసలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర అధినాయకత్వం స్థానిక మున్సిపాలిటీకి ప్రత్యేక ఎన్నికల ఇన్చార్జిగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ ను నియమించింది.
అభ్యర్థుల విజయానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ శివకుమార్ తదితరులు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం కోసం పట్టణంలోని 37 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ శ్రేణుల్లో భరోసా నింపుతూ అభ్యర్థుల విజయం కోసం పాటుపడుతున్నారు. పార్టీ నేతలు అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి, గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఓటరుకూ వివరిస్తున్నారు.