సంగారెడ్డి కలెక్టరేట్: సమాజంలో ప్రతి ఒక్కరికీ బీమా కల్పించి వారి జీవితాలకు భరోసా కల్పిద్దామని సికింద్రాబాద్ డివిజన్ లియాఫీ అధ్యక్షుడు వెంకటయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎంఎం గార్డేన్స్లో జరిగిన భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య 1964 (లియాఫీ) సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా 400 మందితో సభ్యత్వం నమోదు చేసి దేశంలోనే సంగారెడ్డి లియాఫీ ముందంజలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచిందని అభినందించారు.
ఎక్కడా లేనివిధంగా బెనివాలెంట్ ఫండ్, హౌజింగ్ సోసైటీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కరోనా బాధితుల కోసం తమ వంతు సహకారం అందించిన సంగారెడ్డి లియాఫీ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారంలో లియాఫీ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా ఎల్ఐసీ ప్రైవేటు పరం కాదని, కేవలం కొంత శాతం వాటాను మాత్రమే అమ్ముకుంటున్నందున ఏజెంట్లు ఆందోళనకు గురి చెండాల్సిన అవసరం లేదన్నారు. సంస్థ అభివృద్ధితో పాటు తమ అభివృద్ధి కోసం ఎక్కువ మందికి జీవిత బీమాను అందించి తమ సేవలను విస్తృతం చేయాలని కోరారు.
కనీసం 30 మంది ఎండీఅర్టీ సాధించాలి
కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గతంలో ఒక ఎండీఆర్టీ సాధించడమే కష్టంగా ఉండే ఈ బ్రాంచ్లో ప్రతి ఏటా రెండంఖేల ఎండీఆర్టీలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వార్షిక సంవత్సరంలో కనీసం 30 మంది ఏజెంట్లు ఎండీఅర్టీ సాధించాలని కోరారు. అందుకోసం తమ వంతు సహకారం ఉంటుందన్నారు.అనంతరం లియాఫీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా పట్నం స్వరూప్ చంద్ర, ప్రధాన కార్యదర్శిగా కె రమేశ్బాబు. కోశాధికారిగా సుకానందరెడ్డిని ఎన్నుకున్నారు. కాగా, పాత కమిటీనే తిరిగి ఎన్నుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ లియాఫీ ప్రధాన కార్యదర్శి రామస్వామి, ఎల్ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు.