పటాన్చెరు, మే 9 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రూ. 2కోట్ల సీఎస్సార్ నిధులతో పంచాయతీరాజ్, నీటి పారుదలశాఖ, రోడ్డు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖల సకృత భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అరవై ఏండ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయని గుర్తు చేశారు. వాటిలోనే ప్రభుత్వ శాఖల సేవలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా పటాన్చెరును మార్చాలనే ఆలోచనతో పాత ప్రభుత్వ కార్యాలయాల స్థానంలో నూతన భవనాలను, అన్ని హంగులతో నిర్మించేందుకు శంకుస్థాపనలు చేశామన్నారు.
భవిష్యత్తులో ఏ పనికోసం వచ్చినా ప్రజలు తేలిగ్గా పని చేయించుకునేలా అన్ని శాఖల భవనాలను ఒకే చోటికి తీసుకుని వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, పంచాయతీరాజ్ జిల్లా అధికారి జగదీశ్వర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రెడ్డి, ఎండీ అఫ్జల్, రమణ తదితరులు పాల్గొన్నారు.