జహీరాబాద్, ఫిబ్రవరి 23 : ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్ మండలాల వ్యవసాయ అధికారులు లావణ్య,అభినాష్ వర్మ తెలిపారు. ఆయా మండలంలోని కొత్తూరు బి, హద్నూర్ గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది, పైరు ఏపుగా పెరుగుతుందని వివరించారు.
అదే క్రమంలో చీడపీడలను తట్టుకుని వేరు శాతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుందన్నారు. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. అలాకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వలన భూమిలో సారం పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు ప్రవీణ్ కుమార్, ఏఈఓలు సాయిలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.