అమీన్పూర్, సెప్టెంబర్ 30 : కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని యాక్సిస్ హోమ్స్ కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు.
కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఆయన పరిశీలించారు. కాలనీ ప్రజలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సరియైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం మూలంగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయనకు వివరించారు.
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని ఆయనను కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాక్సిస్ హోమ్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.
దీంతో కాలనీలోని సమస్యలను పరిశీలించేందుకే తాను పర్యటించినట్లు ఆయన వెల్లడించారు.
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానని ఆయన తెలిపారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నితీషాశ్రీకాంత్, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్, అధికారులు తదితరులు ఉన్నారు.