గజ్వేల్, జనవరి 27: బీటెక్, పీజీ, ఎంబీఏ చదువులు చదివిన వారే కాదు స్వయం ఉపాధి శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న వారు కూడా రూ.15 నుంచి రూ.50 వేలు అంతకుపైగా డబ్బులు సంపాదించవచ్చని రుజువు చేస్తూ నిరుద్యోగ యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నది గజ్వేల్ సెట్విన్ శిక్షణ కేంద్రం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులతోపాటు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా పలు రకాల శిక్షణలు ఇస్తున్నారు. తద్వారా వారిని ఆర్థికంగా ధృఢంగా తయారు చేసి కుటుంబానికి అండగా
నిలిచేలా చేస్తున్నారు.
మంత్రి హరీశ్రావు చొరవతో…
మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని గజ్వేల్లో ఏర్పాటు చేశారు. యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకుని ఆర్థికాభివృద్ధి సాధించి కుటుంబాలకు ఆసరాగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గతంలో జిల్లాకేంద్రంలో మాత్రమే ఉన్న ఈ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని గజ్వేల్లో కూడా ఏర్పాటు చేశారు.
ప్రైవేట్గా లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితంగానే…
గజ్వేల్ పట్టణంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో ఫ్యాషన్ డిజైనింగ్ (3 నెలలు, ఏడాది కోర్సులు), బ్యూటీషియన్ (3 నెలలు, ఏడాది కోర్సులు), కంప్యూటర్ కోర్సులు
(పీజీడీసీఏ, డీటీపీ), ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్, మెహందీ, మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగ్ ట్రేనింగ్, సీసీ టీవీ, కెమెరా ఇన్స్టాలేషన్,ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో గజ్వేల్ సెట్విన్ శిక్షణ కేంద్రం శిక్షణ అందిస్తున్నారు. మూడు నెలల బ్యూటీషియన్ కోర్సుకు ప్రైవేట్ సంస్థల్లో రూ.30 వేలు ఫీజు, ఏడాది కోర్సుకు రూ.లక్షా 50 వేల వరకు వసూలు చేస్తుండగా, సెట్విన్లో కేవలం రూ.1100 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. కంప్యూటర్ కోర్సులు బయట రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ మూడు నెలలకు ప్రైవేటు సంస్థల్లో రూ.25 వేలు, ఏడాది కోర్సుకు రూ.2.5 లక్షలు ఫీజు చెల్లించాల్సి వస్తున్నది. అంతటి ఖరీదైన కోర్సులన్నింటిలో కేవలం రూ.850 నుంచి రూ.1100ల్లోపు నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజుతోనే సెట్విన్ సంస్థ శిక్షణ అందిస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా..
నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజులతో ఎంతో విలువైన శిక్షణ అందిస్తున్న సెట్విన్ పలు కార్పొరేషన్ల ద్వారా ఉచిత శిక్షణ కూడా అందిస్తున్నది. బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ల సహకారంతో యువతీయువకులకు ఉచితంగానే పలు కోర్సుల్లో శిక్షణ అందించి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. పలువురు సెట్విన్ అందించిన సర్టిఫికెట్తో బ్యాంకు ద్వారా, కార్పొరేషన్ రుణాలు పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు.గజ్వేల్లో మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీపార్లర్, మగ్గం వర్క్స్ ద్వారా నెలకు రూ.15 వేల నుంచి 30 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. పలువురు యువకులు హైదరాబాద్లో ఏసీ మెకానిక్గా, కంట్రాక్టర్లుగా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.
శిక్షణ పొందిన వారికి చక్కని ఉపాధి
జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్లలో సెట్విన్ ద్వారా పలు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. జిల్లా యువతతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి సెట్విన్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. స్థానికంగా స్వయం ఉపాధి పొందడంతోపాటు హైదరాబాద్ లాంటి నగరాలు, పట్టణాల్లో రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్నారు. మంత్రి హరీశ్రావు, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచనలతో శిక్షణ పటిష్టంగా అందిస్తున్నాం. యువత మా ద్వారా శిక్షణ పొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో 25 మంది శిక్షణ పొందుతున్నారు. త్వరలో గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా 35 మందికి ఫ్యాషన్ డిజైనింగ్
కోర్సులో శిక్షణ ఇవ్వనున్నాం.