రాష్ట్రంలోనే అత్యధికంగా 1,115 ప్రవేశాలు
ఒక్కరోజే 771 విద్యార్థుల ఎన్రోల్మెంట్
విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం
సత్ఫలితాలు ఇస్తున్న ‘మనఊరు-మనబడి’
ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల హర్షం
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అత్యధిక సంఖ్యలో జరుగుతున్నది. శనివారం ఎన్రోల్మెంట్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 771 మంది విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో ఎన్రోల్ అయ్యారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 7 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, 514 మంది చిన్నారులు అంగన్వాడీల నుంచి ఎన్రోల్ అయ్యారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 18 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, 84 మంది విద్యార్థులు నేరుగా ఎన్రోల్ అయ్యారు. రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల నుంచి 148 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ల్లో ఎన్రోల్ అయ్యారు. మొత్తం 771 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్తో జిల్లాలో ముందంజలో ఉన్నది. కాగా, బడిబాట కార్యక్రమం తొలిరోజు 344 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరుగగా, ఇప్పటివరకు జిల్లాలో 1,115 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్ అయ్యారు. తాజాగా, రాష్ట్రంలోనే ఈ సంఖ్య అత్యధికంగా ఉన్నది. జిల్లాలో ఇదే స్ఫూర్తితో పనిచేసి విద్యార్థులను నమోదును పెంచాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు.
సత్ఫలితాలిస్తున్న ‘మనఊరు-మనబడి’
జిల్లాలో తొలి విడత కింద 441 పాఠశాలలను ‘మనఊరు-మనబడి’ కింద ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతేవేగంతో ఆయా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన జరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందనడానికి ‘బడిబాట’ ఎన్రోల్మెంట్ నిదర్శనం. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ పేద విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు నిర్ణయించారు. ఇప్పటివరకు పూర్తిగా తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే ఇబ్బందులు వస్తాయనే భావనతో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది.
శనివారం నాగల్గిద్ద మండల కేంద్రంలో బడిబాటలో భాగంగా ఇంటింటికీ తిరిగి విద్యార్థుల వివరాలు సేకరిస్తున్న ఉపాధ్యాయులు