సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 22: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచేలా సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శరత్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో పదో తరగతి బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థులకు స్నాక్స్ అందించడం, క్యాటరింగ్, నాణ్యత గల ఆహారం అందించడం, పర్యవేక్షణ తదితర అంశాలపై ఎంఈవోలు, హెచ్ఎంలు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, సరుకు రవాణా కాంట్రాక్టర్లు తదితరులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఫలితాల్లో జిల్లా టాప్లో ఉండాలని మంత్రి చెప్పిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగ బాధ్యత, కర్తవ్యాన్ని మరవద్దన్నారు. విద్యార్థి భవిష్యత్కు పదో తరగతి పునాది లాంటిదన్నారు. ప్రస్తుత ఏడాది 6 పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు.
జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్దేశిత సమయాల్లో తరగతుల నిర్వహణ ఉండాలన్నా రు. స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పు న ప్రభుత్వం ఇస్తున్నదని, మంచి స్నాక్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలని, పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, వసతి గృహాల్లో ఆయా విద్యార్థుల చదువు విషయమై సంబంధిత ప్రిన్సిపాల్స్, వసతి గృహాల సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో 100కు 100 శాతం ఫలితాలు రావాలని, లేనిపక్షంలో సంబంధిత సబ్జెక్టు టీచర్, వసతి గృహ సంక్షేమ అధికారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టపోతే సహించేది లేదని, నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. సంక్షేమ అధికారుల పర్యవేక్షణ ఉండాలని తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఈవో రాజేశ్, పలు సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీవోలు తదితరులున్నారు.