సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 8: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 28లోగా 100 శాతం పన్ను వసూలు పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీలు, డీఎల్పీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద యాక్టీవ్ లేబర్లో 50శాతం లేబర్ మొబిలైజేషన్ చేయాలని స్పష్టం చేశారు. చేసిన పనికి సంబంధించి ప్రాపర్గా రికార్డ్ చేసి, లేబర్లకు పే స్లిప్స్ ఇవ్వాలని సూచించారు.
ఈజీఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 పనులు శల్ఫ్లో ఉండాలన్నారు. శ్రమశక్తి సంఘాలతో సమావేశం నిర్వహించి ఆయా పనుల జాబితా ఇవ్వాలన్నారు. ఫీజిబుల్ వర్క్స్ ఉండాలని, పలువురు పంచాయతీ కార్యదర్శుల అలసత్వం, నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికి పని చేసే హక్కు ఉన్నదన్నారు. అడిగిన వారికి ఈజీఎస్లో 15 రోజుల్లోగా పని కల్పించాలన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు. చెత్త అమ్మకంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరాలని తెలిపారు. ప్లాంటేషన్కు రెగ్యులర్గా వాటరింగ్ చేయాలన్నారు. ట్యాంకర్ ద్వారా వాటరింగ్ చేయడంతో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు. అయితే ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలు సమర్పించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను విధిగా సంరక్షించాలన్నారు. వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వైకుంఠధామాల చుట్టూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతి రోజు చెత్తను సేకరించాలి
ప్రతి రోజు ఇంటింటా చెత్త సేకరణ జరగాలని, సెగ్రిగేషన్ జరగాలని, తడి చెత్త కంపోస్ట్ తయారు కావాలని కలెక్టర్ సూచించారు. తడి, పొడి చెత్త అమ్మకంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరాలన్నారు. వచ్చిన ఆదాయంలో పంచాయతీ కార్మికులకు అవసరమైన నూనె, సబ్బులు తదితర వస్తువులతో కిట్ ఇవ్వాలని సూచించారు. ఆసరా పింఛన్లకు అర్హత ఉన్న ఎవరూ మిస్ కావొద్దని, ఉన్నవారి దరఖాస్తులను ఈ నెల 23లోగా ఎంపీడీవోలకు పంపించాలని పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా దరఖాస్తులను డీఆర్డీవోకు సమర్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. నర్సరీలు 100 శాతం జర్మినేషన్ కావాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు పీడీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.