సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 31: జిల్లాలో పోడు భూములకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఫిబ్రవరి 4లోగా పూర్తి కావాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో పోడుపట్టాల పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు పట్టాల పంపిణీలో అర్హులకు ఎలాంటి అన్యాయం జరుగరాదన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు. గ్రామసభల్లో చేసిన తీర్మానాల మేరకు 100శాతం ఎస్డీఎల్సీ జిల్లాస్థాయి కమిటీకి పంపాలని సూచించారు. గ్రామ సభల తీర్మానాలు, ఎస్డీఎల్సీల మధ్య గ్యాప్ ఉండరాదని స్పష్టం చేశారు. ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం గిరిజనులకు సంబంధించి రెండు రుజువులు ఉంటే చాలన్నారు.
ఎస్డీఎల్సీలో తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. మంగళవారమే ఎస్డీఎల్సీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకుగల కారణాలు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఫిబ్రవరి 3 నాటికి పోడు పట్టాల ప్రింటింగ్ పూర్తి కావాలన్నారు. ఫిబ్రవరి 4లోగా అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్ట చేశారు. జిల్లా కమిటీ సమావేశం ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఆమోదించిన తరువాత ఆయా దరఖాస్తులను సంబంధిత వైబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, అటవీశాఖ అధికారి శ్రీధర్ రావు, డీపీవో సురేశ్ మోహన్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
కనీసం 50 శాతం కూలీలను చైతన్యం చేయాలి
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో కనీసం 50శాతం కూలీలను చైతన్యం చేయాలని కలెక్టర్ శరత్ సూ చించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల అధికారులతో గ్రామీణ హామీ పథకంలో కూలీల చైతన్యం, పనుల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని యాక్షన్ లేబర్లో 50 శాతం లేబర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పనులను గుర్తించాలని, 20శాతం పనులు సెల్ఫ్లో ఉండాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ వారంతంలోగా 50 శాతం లేబర్ మొబిలైజేషన్ లేని ఫీల్డ్అసిస్టెంట్లు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రమ శక్తి సంఘాలను గుర్తించి, పనులు అప్పగించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులున్నారు.