రైతుబంధు, రైతుబీమా పెండింగ్ ఉండరాదు
ఎరువులను అందుబాటులో ఉంచాలి
రెవెన్యూ సదస్సులకు ప్రణాళికలు రూపొందించాలి
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 8: రైతులకు పంట రుణాలు అందించడంపై దృష్టి సారించాలని, రైతుబంధు, రైతుబీమా పెండింగ్లో ఉండరాదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. క్రాప్ ప్లానింగ్, రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల నిల్వలు, పంట రుణాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలం పంటల ప్రణాళిక అమలయ్యేలా చూడాలన్నారు. క్రాపింగ్ ప్లాన్ ప్రకారం ఏ పంట వేయాల్సి ఉన్నదో, ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్యాక్స్ ద్వారా ఎరువుల పంపిణీ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు ఎంతమంది రైతులు లబ్ధి పొందారన్న వివరాలతో నివేదికను అందజేయాలన్నారు. కొత్త పాస్ బుక్స్ వచ్చిన వారికి కూడా రైతుబంధు అందాలన్నారు. రైతు నివేదికలో శిక్షణ నిర్వహణ షెడ్యూల్ను ఇవ్వాలని ఆదేశించారు.
ఆగస్టు 15లోగా 100 శాతం ప్లాంటేషన్ పూర్తి కావాలి
జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి మండలంలోని గ్రామాలను 3 భాగాలుగా విభజించి 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులను మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించాలన్నారు. సదస్సులకు వచ్చే రైతులకు కనీస వసతులు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
యువతకు క్రీడా ప్రాంగణాలు
గ్రామీణ యువతకు క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎకరా స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. మండలం వారీగా ప్రాంగణాలకు స్థలాలు స్వాధీనం చేయని తహసీల్దార్లు వెంటనే గుర్తించాలని ఆదేశించారు. హరితహారంపై దిశా నిర్దేశం చేశారు. లక్ష్యానికి మించి మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని, ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, డీఆర్వో రాధికా రమణి, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, డీఆర్డీవో పీడీ, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపేయాలని వినతి
సంగారెడ్డి అర్బన్, జూలై 8: కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపేయాలని కోరుతూ కంది మండలం ఇంద్రకరణ్ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంగారెడ్డి కలెక్టర్ ఏ.శరత్కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ నరేశ్గౌడ్, వార్డు మెంబర్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఇంద్రకరణ్ గ్రామంలో సర్వే నంబర్ 344లో నిర్మిస్తున్న పవన్ టెక్స్టైల్స్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు రెండు ఫ్యాక్టరీలతో పొలాలు దెబ్బతింటున్నాయని, గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, నాయకులు బొంగుల రవి పాల్గొన్నారు.