కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. చాలామంది మాస్క్లు, శానిటైజర్లు వాడడం మానేశారు. జన సమ్మర్ధంలో ఉన్నప్పుడు ఎవరైనా కరోనా లక్షణాలతో ఉన్న పక్షంలో మాస్క్ ధరించని వారికి సోకే ప్రమాదం ఉంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన సమయంలో కచ్చితంగా మాస్కు ధరించాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి. షాపింగ్ సమయంలో, ప్రయాణం చేస్తున్నప్పుడు, రద్దీ ప్రాంతాల్లో తప్పక కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా కరోనా లక్షణా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.
సంగారెడ్డి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంకా కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ఇంకనూ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది మాస్క్ వాడడం మానేశారు. శానిటైజర్లు వాడడం లేదు. బహిరంగ ప్రదేశాలు, జన సమ్మర్ధ ప్రాంతాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇబ్బందుల పాలయ్యే అవకాశమున్నది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. మరికొన్ని నెలల పాటు మాస్క్ తప్పకుండా ఉపయోగించాలంటున్నారు. కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. వందశాతం వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రజలు బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నారు. శుక్రవారం దసరా పండుగ జరుపుకోనున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లిన వారు సొంతూర్లకు చేరుకుంటున్నారు. వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్, రిటైల్ షాపులు జనంతో కిటకిటలాడుతున్నాయి. జనమంతా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నది. జన సమ్మర్ధంలో ఎవరైనా ఒకరు కరోనా లక్షణాలతో ఉన్న పక్షంలో మిగితా వారికి సోకే ప్రమాదమున్నది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన సమయంలో కచ్చితంగా మాస్కు ధరించాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి. లేనిపక్షంలో శానిటైజర్ వాడాలి. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్ టెస్టు చేయించుకుని ఐసొలేషన్లో ఉండాలని వైద్యలు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు గుంపులుగా చేరవద్దని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా ముప్పు తొలగాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేసుకోవటం తప్పనిసరి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 9,10,144 మంది వ్యాక్సిన్ వేశారు. ఇందులో 6,74,150 మందికి సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 2,35,994 మంది రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయ్యింది. నెలాఖరు వరకు జిల్లాలోని 12 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
వరుస పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించకుండా జనసమ్మర్ధంలో తిరగడం సరికాదు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మంచిది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి.
డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా వైద్యాధికారి సంగారెడ్డి