మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 20: రైతు కుటుంబానికి రైతు బీమా పథకం కొండంత అండగా నిలుస్తోంది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గుంట జాగా ఉన్న రైతుకు కూ డా ఈ పథకంలో అవకాశం కల్పించడంతో పాటు బీమా సొమ్మును ప్రభుత్వమే భరిస్తోంది. ప్ర మా దం, సాధారణ మరణంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సమయంలో బీమా సొమ్ము ఆర్థికం గా ఆదుకుంటోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ పథకంపై గ్రామగ్రామానా అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఇంటికీ తిరిగి రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే ఈ నెల 31వ తేదీలోపు రైతు బీమా కోసం రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
నాలుగేండ్లలో 3472 మంది లబ్ధిదారులు..
మెదక్ జిల్లాలో రైతు బీమా పథకంలో ఇప్పటి వరకు 2,39,070 మంది రైతులను సర్వే చేయగా, 1,49,210 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 3472 మంది రైతులకు రూ.173.60 కోట్లు జమ అయ్యాయి. ఇదిలావుండగా 2018-19వ సంవత్సరంలో 1,08,982 మంది రైతులు, 2019-20 సంవత్సరంలో 1,16,897 మంది, 2020-21లో 1,33,556 మంది, 2021-22లో 1,49,210 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. ఇందులో 2018లో 707 మంది రైతులకు రూ.35.35 కోట్లు, 2019లో 864 మంది రైతులకు రూ.43.20 కోట్లు, 2020లో 1397 మంది రైతులకు రూ.69.85 కోట్లు, 2021లో 504 మంది రైతులకు రూ.25.20 కోట్లు రైతు చనిపోయిన తర్వాత వారి నామినీ ఖాతాలో జమ అయ్యాయి. మొత్తం నాలుగేండ్లలో 3472 మంది రైతులకు రూ.173.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కింద జమ చేసింది.
18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు రైతులకు..
తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుంచి రైతుబీమా కింద రూ.5 లక్షల బీమా లభిస్తుంది. ఏ రైతు మరణించినా రూ.5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. ఏదైనా కారణాలతో రైతు మరణం సంభవిస్తే కుటుంబంలో ఈ పథకం కింద రూ.5 లక్షల నష్టపరిహారం పొందుతున్నారు. రైతు బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. రైతు చనిపోతే రైతు కుటుంబంలో నామినీకి పది రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు పొందుతారు. రైతు బీమా కార్యక్రమం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం లభిస్తుంది.
సంగారెడ్డి జిల్లాలో రూ.262 కోట్ల పరిహారం పంపిణీ
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల రైతులను అర్హులుగా గుర్తించారు. 2018 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5,258 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.262 కోట్ల బీమా పరిహారం సొమ్మును ప్రభుత్వం అందజేసింది.
నామినీ ఖాతాలో బీమా డబ్బులు జమ..
రైతు బీమాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఏఈవోలు రైతుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అన్నీ ఒకే అనుకున్న తర్వాత సంస్థ నుంచి నేరుగా రూ.5 లక్షలు బాధిత నామినీ ఖాతాలో జమ అవుతున్నాయి. రైతు బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
– పరశురాం నాయక్, మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఇప్పటి వరకు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– నర్సింహారావు, సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి