న్యూఢిల్లీ, జూలై 31: మారుతి సుజుకీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,446. 90 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,792.4 కోట్ల లాభంతో పోలిస్తే 9.11 శాతం తగ్గుముఖం పట్టింది. గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో వాహనాలను విక్రయించినప్పటికీ ముడి సరుకుల వ్యయం అధికం కావడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. అయినప్పటికీ సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 35.9 శాతం ఎగబాకి రూ.52,469.8 కోట్లకు చేరుకున్నది. కిందటేడాది ఇదే త్రైమాసికానికిగాను రూ.38,605.2 కోట్లుగా నమోదైంది. నిర్వహణ ఖర్చులు రూ.35,585.4 కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు పెరుగడం వల్లనే లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైందని పేర్కొంది. దీంట్లో ముడి సరుకు కోసమే రూ.32,013 కోట్ల నిధులను వెచ్చించింది. మారుతి రికార్డు స్థాయిలో వాహనాలను విక్రయించింది. గత త్రైమాసికానికిగాను సంస్థ 6,82,724 యూనిట్ల వాహన అమ్మకాలు జరిపింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో వాహనాలను విక్రయించడం ఇదే తొలిసారి