తిరుమల : తిరుమల ( Tirumala )కు వచ్చే ప్రైవేటు వాహనాల ( Vehicles ) పై ఆంక్షలు విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ( TTD ) ఖండించింది . రోజుకు 15వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది.
తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని , సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని, వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదని పేర్కొంది. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.