Singer Gulab Sidhu : పంజాబ్లో గన్ వయెలెన్స్ పెరిగిపోతోంది. అందులోనూ గాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరో సింగర్ ఇంటిపై కాల్పులు జరిగాయి. పంజాబి సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. ఈ అంశంపై పోలీసులు తెలిపిన వివరాలివి. పంజాబ్, బర్నాలా జిల్లా, ఫర్వాహి గ్రామంలో శనివారం రాత్రి స్థానిక సింగర్ గులాబ్ సిద్ధు ఇంటివద్ద ఈ ఘటన జరిగింది.
ఒక బైకుపై, ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు సిద్ధు ఇంటికి చేరుకుని కాల్పులు జరిపారు. ఇద్దరు తమ వద్ద ఉన్న గన్స్తో కాల్పులు జరపగా.. మరో వ్యక్తి బైక్ రైడ్ చేశాడు. ఇదే సమయంలో ఈ ఘటనను వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంటిపై జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. దుండగులు మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇంటి సమీపంలో బుల్లెట్ల ఆనవాళ్లున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో సిద్ధు లేడు. అతడి కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై సిద్ధు కుటంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంటి గేటు వద్ద బుల్లెట్లు తగిలినట్లు గుర్తించారు. అలాగే, అక్కడి సీసీటీవీ కెమెరాల్ని కూడా పరిశీలించారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొద్ది రోజులకు ముందే సింగర్ గులాబ్ సింగ్ను హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. గులాబ్ సిద్ధు.. గతంలో మరణించిన ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలకు సన్నిహితుడు. మూసేవాలా కూడా కాల్పుల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఇటీవల పలువురు పంజాబ్ సింగర్లకు బెదిరింపులు రావడం సాధారణమైపోయింది. పలువురు సింగర్ల ఇంటి వద్ద దుండగులు కాల్పులు కూడా జరిపారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.