చేగుంట, మార్చి27: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు గేట్లు తెరిచి పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతండాలో ఆయన పర్యటించి ఎండిపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. పంటలు పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతగా మారడంతో పలువురు రైతులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కంట తడిపెట్టగా ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కూడా సక్రమంగా రావటం లేదని, ఇప్పటికైనా నీళ్లు విడిచి పంటలను కాపాడాలన్నారు. ఎండిపోయిన పంటకు రూ. 20వేల వరకు పరిహారం చెల్లించాలన్నారు. రైతులు పంటలు ఎండిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో కూర్చొని ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ల నుంచి నీళ్లను విడుదల చేసి వాగులు, చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో నర్సంపల్లి పెద్దతండా మాజీ సర్పంచ్ చత్రీయనాయక్, నార్సింగి, చేగుంట జడ్పీటీసీలు బాణపురం కృష్ణారెడ్డి, ముదాం శ్రీనివాస్, మాజీ వైస్ఎంపీపీ మల్లేశం గౌడ్, చేగుంట మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకుడు భాషతో పాటు పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.