రామాయంపేట, మే 30: ఆ గురుకుల విద్యాలయం విద్యార్థుల పాలిట దేవాలయం. పచ్చని చెట్లతో ఆహ్లాద పరుస్తున్న చదువులమ్మ నిలయం. పట్టణానికి సుదూరంలో ఉన్నా రామాయంపేటకే అందాన్నిస్తున్నది. ఎక్కడాలేని వాతావరణం ఆ గురుకులంలోనే ఉంది. రామాయంపేటకు కూత వేటు దూరంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల. హరిత వనాలు ఆ గురుకులాన్నే పచ్చ తోరణాలతో కప్పేశాయి.
గురుకులంలో చదివే విద్యార్థినులు సైతం ఉదయం లేవగానే హోమ్వర్క్ చేసుకునేందుకు చెట్ల నీడలోనే పూర్తి చేస్తారు. వారి వెంటే టీచర్లు కూడా సేద తీరుతారు. ఎక్కడెక్కడి నుంచో చదువు కోసం వచ్చే విద్యార్థులు ఒక్కసారి గురుకులంలో అడ్మిషన్ తీసుకున్నారంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు వదలరు. విద్యార్థులు ఆటపాటల్లోనూ మేటి. ప్రిన్సిపాల్ అన్నీ తానై విద్యార్థులకు చదువుతో పాటు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. దశాబ్దం క్రితం అటవీ ప్రాంతంగా ఉన్న గురుకుల పాఠశాల ఆవరణ హరితహారంతో పచ్చందాలకు నెలవైంది. హరితహారంలో భాగంగా ఏడేండ్ల క్రితం పెట్టిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి గురుకులానికి అందాన్నిస్తున్నాయి.
చెట్లంటే ప్రాణం..
చెట్లంటే నాకు అమితమైన ప్రేమ. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నేను మొట్టమొదలు చూసేది హరిత వనాలనే. ముందు వాటికి నీళ్లు పోసిన తర్వాతే ఇతర పనులు. ఇక్కడి పిల్లలంతా తరగతి గదిలోనే నాకు విద్యార్థులు. తర్వాత వారంతా నా సొంత బిడ్డలే! వారిలో ఎవ్వరికి దగ్గు, జలుబు వచ్చినా ముందు దవాఖానకు తీసుకెళ్తా. ఆ బిడ్డలకు ఏ ఆపద వచ్చినా నేను ప్రత్యక్షంగా నా పక్కనే పడుకోబెట్టుకుంటా. అంత బాగా చూసుకుంటాం కాబట్టే వారు సెలవుల్లో కూడా ఇంటికి వెళ్లడానికి ఇష్టపడరు.
– సరళాదేవి, ప్రిన్సిపాల్, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల, రామాయంపేట